Jasprit Bumrah Ruled Out Of T20 World Cup: వరుసగా గాయాలపాలవుతున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టీ20 వరల్డ్కప్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగుతాడా? లేక దూరమవుతాడా? అనే విషయంపై కొన్ని రోజుల నుంచి మిస్టరీ నెలకొంది. ఇప్పుడు ఈ మిస్టరీకి తెరదించుతూ.. వరల్డ్కప్కి బుమ్రా దూరం అయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బుమ్రాకి వైద్యం అందిస్తోన్న నిపుణుల బృందం.. అతడు వరల్డ్కప్లో ఆడే అవకాశాలు లేవని నిర్ధారించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడ్ని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
నిజానికి.. కొంతకాలం నుంచి వీపు గాయంతో బాధపడుతున్న బుమ్రా, ఆస్ట్రేలియా సిరీస్తో జట్టులోకి పునరాగమనం ఇవ్వడంతో, కచ్ఛితంగా వరల్డ్కప్ ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ, అతనికి గాయం తీవ్రం అవ్వడంతో బ్రేక్ తప్పలేదు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా టీ20 సిరీస్కు దూరమయ్యాడు. వరల్డ్కప్కి ఇంకా సమయం ఉంది కాబట్టి, అప్పటివరకూ విశ్రాంతి ఇస్తే కోలుకుంటాడని భావించారు. మేనేజ్మెంట్ కూడా అతడు కోలుకోవాలని అనుకుంది. ఎందుకంటే, బుమ్రా భారత జట్టులోనే అత్యుత్తమైన బౌలర్. అతనిలాంటి వాడు దూరమైతే.. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, టోర్నీలోపు కోలుకోవాలని బలంగా కోరుకున్నారు. కానీ, బీసీసీఐ తాజా ప్రకటనతో బుమ్రా వరల్డ్కప్లో ఆడబోవడం లేదని తేలిపోయింది.
కాగా.. అక్టోబర్ 16వ తేదీ నుంచి టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. తొలుత క్వాలిఫయ్యర్ మ్యాచెస్ జరగనున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 23వ తేదీ నుంచి అసలైన సమరం ప్రారంభమవుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. మరోవైపు.. బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
