ఐపీఎల్ 2026 సీజన్ ఇద్దరు యువ బ్యాటర్లను మరింతగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ ఇద్దరే సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ ఇద్దరు తమ దూకుడు బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. పవర్ప్లే నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన వండర్ కిడ్ వైభవ్, సిక్సర్ల కింగ్ అభిషేక్ టీ20 క్రికెట్లో కొత్త ట్రెండ్ను సృష్టించారు. ఐపీఎల్ 2026 అనంతరం భవిష్యత్ టీ20ల్లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా అభిషేక్-వైభవ్ను చూడాలనే డిమాండ్ అభిమానుల నుంచి బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడం, మ్యాచ్ను కొద్ది ఓవర్లలోనే మలుపుతిప్పే సామర్థ్యం కలిగి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
15 మ్యాచ్ల్లో 563 పరుగులు:
సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అభిషేక్ శర్మ ఈ సీజన్లో మరోసారి తన దూకుడు ఆటతో ఆకట్టుకున్నాడు. రూ.14 కోట్ల పారితోషికానికి తగ్గట్టుగా అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు.. జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. 15 మ్యాచ్ల్లో 563 పరుగులు చేసిన అభిషేక్.. 40.21 సగటు, 204.73 స్ట్రైక్రేట్తో సీజన్ను ముగించాడు. అతని అత్యధిక స్కోరు 135 పరుగులు. ఈ సీజన్లో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. టోర్నీలో మొత్తం 43 సిక్సర్లు, 50 ఫోర్లు బాది ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
16 మ్యాచ్ల్లో 776 పరుగులు:
15 ఏళ్ల వయసులో ఐపీఎల్లో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ యువ బ్యాటర్.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసిన వైభవ్.. 48.50 సగటుతో పాటు 237.31 అద్భుత స్ట్రైక్రేట్ నమోదు చేశాడు. ఒక శతకం, ఐదు అర్ధశతకాలతో అదరగొట్టిన బుడ్డోడు.. టోర్నీలోనే అత్యధికంగా 72 సిక్సర్లు, 63 ఫోర్లు బాదాడు. అతని దూకుడు బ్యాటింగ్కు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అయ్యాయి.
వైభవ్ సూర్యవంశీ ఆధిపత్యం:
ఐపీఎల్ 2026లో పరుగులు, స్ట్రైక్రేట్, సిక్సర్ల పరంగా చూస్తే వైభవ్ సూర్యవంశీ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. అయితే అభిషేక్ శర్మ కూడా 200కు పైగా స్ట్రైక్రేట్తో పరుగులు చేశాడు. వైభవ్ 776 పరుగులు, 237.31 స్ట్రైక్రేట్తో సీజన్ టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ 563 పరుగులు, 204.73 స్ట్రైక్రేట్తో సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్, వైభవ్ ఆటతీరు పరిశీలిస్తే ఆధునిక టీ20 క్రికెట్కు సరిగ్గా సరిపోతారు. పవర్ప్లేలోనే మ్యాచ్ను ప్రత్యర్థి చేతుల్లో నుంచి లాక్కునే సామర్థ్యం వీరిద్దరిలో ఉంది. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా బౌలర్లపై ఎదురుదాడి చేయగలరు. ఇద్దరూ ఎడమచేతి బ్యాటర్లు కావడం వల్ల ప్రత్యర్థి కెప్టెన్ల వ్యూహాలను దెబ్బతీయగలరు. ముఖ్యంగా తొలి ఆరు ఓవర్లలోనే భారీ స్కోరు అందించే సామర్థ్యం వీరిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
తడిసిపోతుంది భయ్యా:
అభిషేక్ శర్మ ఇప్పటికే భారత జట్టులో అవకాశాలు అందుకుంటుండగా.. వైభవ్ సూర్యవంశీ కూడా త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో చూపించిన ఫామ్ను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగించగలిగితే.. రాబోయే సంవత్సరాల్లో టీ20ల్లో భారత జట్టుకు అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడీగా అభిషేక్-వైభవ్ నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల ఆశ ఒక్కటే.. ఈ ఇద్దరు యువ బ్యాటర్లు టీమిండియా తరఫున కలిసి ఓపెనింగ్ చేయాలని, ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసం సృష్టించాలని. వండర్ కిడ్-సిక్సర్ల కింగ్ జోడిని తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
