SRH vs CSK Tickets: డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్.. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?

  • ఈరోజు ఉప్పల్‌ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్
  • డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్
  • ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?
Srh Vs Csk Tickets Controversy

Srh Vs Csk Tickets Controversy

SRH vs CSK Tickets Controversy: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఉప్పల్‌ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్‌ నేపథ్యంలో టికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌పై భారీ క్రేజ్ ఉండటంతో అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలను భారీగా పెంచడం కూడా అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

ఉప్పల్‌ స్టేడియంలో సౌత్ ఈస్ట్, వెస్ట్ టెర్రస్ టికెట్ల ధరలను రూ.1250 నుంచి రూ.2500కు పెంచారు. ఈస్ట్, వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్ల ధరలను రూ.2250 నుంచి రూ.3500కు పెంచారు. ఇక కార్పొరేట్ బాక్స్ టికెట్ల ధరలను రూ.23,000 నుంచి ఏకంగా రూ.33,000కు పెంచడం విమర్శలకు దారితీసింది. బుకింగ్ చార్జీలు కూడా రూ.300 నుంచి రూ.2000 వరకు పెరగడం అభిమానులను మరింత అసహనానికి గురి చేస్తోంది. టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. డిస్ట్రిక్ట్‌ యాప్‌లో సరైన విధంగా అందుబాటులో ఉంచడం లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్స్ కోసం ఆన్‌లైన్‌లో భారీ క్యూ ఉండడం, పేమెంట్ చేసే సమయంలో సోల్డ్ అవుట్ అని పడడంతో ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.

Also Read: IPL 2026-SRH: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక అప్‌డేట్‌.. సన్‌రైజర్స్‌లోకి ముంబై ఇండియన్స్ పేసర్!

ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే టికెట్లను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసి.. బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్న అనుమానాలు కూడా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరంగా బ్లాక్ మార్కెట్‌లో కూడా టికెట్లు దొరకడం లేదని కొందరు ఫాన్స్ అంటున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్‌పై క్రేజ్ మరింత పెరిగింది. ధోనీని ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. టికెట్లు దొరకకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. టికెట్లను పెద్ద మొత్తంలో చెన్నైకి తరలించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లో టికెట్స్ అమ్ముకుని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా? అని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.