ఐపీఎల్ 2026 సీజన్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ.. పిచ్ చాలా బాగుందని, మ్యాచ్ సాగుతున్న కొద్దీ పెద్దగా మారకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ స్టేడియంతో గత ఏడాదికి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, ప్రస్తుతం తమ నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెడుతూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా అదే పాత విన్నింగ్ టీమ్తో బరిలోకి దిగుతోంది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచినా మొదట బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. తొలి మూడు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుండి కొంత మూవ్మెంట్ లభించే అవకాశం ఉందన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఒక కీలక మార్పు చేశారు. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు.
ఇరు జట్ల తుది ప్లేయింగ్ ఎలెవన్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవదూత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్వుడ్, రసిఖ్ సలామ్ దార్.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సాయ్ సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, అర్షద్ ఖాన్, కాగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని చూస్తుండగా, హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ తమ రెండో ఐపీఎల్ టైటిల్పై కన్నేసింది. విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీకి బలంగా మారగా.. రబాడ, గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లతో గుజరాత్ సైతం బలంగా కనిపిస్తోంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఏ జట్టు విజేతగా నిలిచి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటుందో చూడాలి.
