టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీ20 జట్టు తదుపరి కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరును బలంగా ప్రతిపాదించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం, ప్రస్తుతం బ్యాటింగ్లో చూపిస్తున్న నిలకడ శాంసన్ను ఒక అద్భుతమైన కెప్టెన్సీ అభ్యర్థిగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు నెలల క్రితం స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో సంజూ శాంసన్ ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లోనే 321 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచారు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్ నుండి న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ వరకు వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. “సూర్యకుమార్ యాదవ్ రాబోయే రెండేళ్లలో జట్టును ఎలా నడిపిస్తారనే దానిపై తదుపరి ప్రపంచకప్ (2028) కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. అయితే సంజూ గతంలోనే రాజస్థాన్ రాయల్స్ను సమర్థవంతంగా నడిపించి తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన బ్యాటింగ్లో కనిపిస్తున్న పరిణతి చూస్తుంటే, భవిష్యత్తులో భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.
గతంలో సంజూ ఆట తీరుపై ఎన్నో సందేహాలు ఉండేవని, కానీ ఇప్పుడు వాటన్నింటినీ ఆయన తన ప్రదర్శనతో పటాపంచలు చేశారని శాస్త్రి అన్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజూ, 11 ఇన్నింగ్స్ల్లోనే 430 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈ ఏడాది ఆయన ఆడిన 21 టీ20 మ్యాచ్ల్లో మొత్తం 797 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం మెరుపు ఇన్నింగ్స్లే కాకుండా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడటం సంజూలో వచ్చిన గొప్ప మార్పు అని రవిశాస్త్రి కొనియాడారు.
