IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!

Ipl 2026 Centuries

Ipl 2026 Centuries

IPL 2026: పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు మన దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ 2026పై పడేలా కనిపిస్తోంది. ఇక, ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో.. లీగ్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రయాణ లాజిస్టిక్స్, విపరీతమైన ఇంధన వినియోగం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చ మొదలైంది. ఇప్పటికే దేశంలోని ప్రజలు పొదుపు నియమాలు పాటించాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఐపీఎల్ ఫ్లేఆప్స్ మ్యాచులను రీ షెడ్యూల్ చేయాలనే వాదన ముదురుతోంది. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడా ఈవెంట్లను కేవలం ఆటల పరంగానే కాకుండా.. దేశ వనరుల నిర్వహణ, అంతర్జాతీయ స్థిరత్వం అనే కోణంలో కూడా చూడాల్సి వస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు వచ్చినా వాటిని పాటించడానికి లీగ్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, స్వతంత్ర సంస్థలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చన్నారు. కానీ తాము మాత్రం భారత ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటామని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రతినిధితో చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే కచ్చితంగా వాటిని పరిశీలించి, అమలు చేస్తామని ధుమాల్ పేర్కొన్నారు.

మరోవైపు, చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఒక లేఖ రాశారు. దేశంలో ప్రస్తుతం పొదుపు చర్యలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో.. ఐపీఎల్ షెడ్యూల్‌ను పునఃసమీక్షించాలని లేఖలో కోరారు. జట్లు విమానాల్లో ప్రయాణించడాన్ని తగ్గించడం, ప్రేక్షకులను లేకుండా మ్యాచ్‌లు నిర్వహించడం, పరిమిత వేదికల్లోనే ఆటలను ముగించడం ద్వారా లక్షలాది లీటర్ల విమాన ఇంధనం (ఏటీఎఫ్), పెట్రోల్, డీజిల్ ఆదా అవుతాయని, ఇది దేశంపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని గోయల్ ఆ లేఖలో సూచించారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలోనూ బీసీసీఐ ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సీజన్ మార్చి 28న ప్రారంభమైనప్పటి నుంచి ఐపీఎల్ జట్లు విమానాలు, రోడ్డు మార్గాల ద్వారా భారీగా ప్రయాణాలు చేస్తున్నాయని బ్రిజేష్ గోయల్ ఎత్తిచూపారు. షెడ్యూల్‌ను కుదించడం లేదా ఒకే ప్రాంతంలోని వేదికల (వెన్యూ క్లస్టరింగ్) కు మ్యాచ్‌లను పరిమితం చేయడం ద్వారా ఏవియేషన్ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వాదించారు. సాధారణంగా ఐపీఎల్ జట్లు ప్రయాణించే బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ320 వంటి చార్టర్డ్ విమానాలు గంటకు వేలాది లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తాయి. సీజన్ మొత్తంలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి వాడిన ఇంధన పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ప్రత్యామ్నాయ షెడ్యూల్ ఫార్మాట్‌లను ఆలోచించాల్సిన అవసరం ఉందని సీటీఐ స్పష్టం చేసింది.

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో దేశీయ విధానాలకు, గ్లోబల్ స్పోర్ట్స్ క్యాలెండర్‌కు మధ్య సమతుల్యతను కాపాడటం భారతదేశంలో పెద్ద స్పోర్టింగ్ లీగ్‌లకు ఒక సవాలుగా మారింది. ఇది కేవలం ఆట మాత్రమే కాకుండా లాజిస్టిక్స్, పర్యావరణ స్థిరత్వం, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో ముడిపడి ఉన్న అంశంగా మారింది. ప్రస్తుతానికైతే ఈ లేఖపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఐపీఎల్ నిర్వాహకులు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ప్లేఆఫ్స్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరికొంత కాలం వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.