Jasprit Bumrah Injury Scare Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయమైనట్లు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలో బుమ్రా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకప్నా? లేదా ఏదైనా గాయమైందా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఐపీఎల్ ఆరంభానికి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో.. బుమ్రా ఇంకా జట్టుతో చేరకపోవడంతో ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
జస్ప్రీత్ బుమ్రా కొన్నేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతేడాది కూడా వెన్ను నొప్పి కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. అయితే కోలుకుని వచ్చిన బుమ్రా.. టీ20 ప్రపంచ కప్ 2026లో మెరిశాడు. కీలక సమయాల్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. 8 మ్యాచ్లలో 14 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4/15 గణాంకాలతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
Also Read: Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా కర్ణాటకలోని బీసీసీఐకేంద్రంలో ఉన్నాడు. 2026 ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న సమయంలో అతను ఇంకా ముంబై ఇండియన్స్ క్యాంప్లో చేరకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. జట్టులో కీలక బౌలర్గా ఉన్న బుమ్రా లేకపోతే ముంబై బౌలింగ్ దళం బలహీనపడే అవకాశం ఉంది. ముంబై ఇప్పటికే కెప్టెన్సీ అంశంపై చర్చలతో వార్తల్లో నిలుస్తున్న వేళ.. ఇప్పుడు బుమ్రా పరిస్థితి కూడా మరో సమస్యగా మారనుంది. సరైన ఫిట్నెస్ లేకుంటే తొలి మ్యాచ్లకు బుమ్రా దూరం కానున్నాడు. త్వరలోనే బీసీసీఐ లేదా ముంబై ఇండియన్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
