ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్ కోసం మంగళవారం అబుదాబిలో జరిగిన మినీ వేలం ముగిసింది. మినీ వేలంలో 77 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో 48 మంది భారతీయులు, 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 10 ప్రాంచైజీలి మొత్తంగా రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. కోల్కతా , రాజస్థాన్ పోటీపడ్డాయి. మధ్యలో చెన్నై రేసులో నిలిచింది. చివరకు కోల్కతా గ్రీన్ను కొనుగోలు చేసింది.
శ్రీలంక పేసర్ మతీశ పతిరనకు వేలంలో భారీ దక్కింది. కనీస ధర రూ.2 కోట్లతో వేలానికి వచ్చిన అతడిని కేకేఆర్ రూ.18 కోట్లకు కైవసం చేసుకుంది. పతిరన కోసం ముందుగా ఢిల్లీ, లక్నో పోటీపడ్డాయి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కేకేఆర్ రూ.18 కోట్లకు ఎగరేసుకుపోయింది. అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు ఊహించని ధరకు అమ్ముడయ్యారు. ఇద్దరినీ చెన్నై చెరో రూ.14.20 కోట్లకు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ను రూ.13 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేయగా.. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ను కోల్కతా రూ.9.20 కోట్లకు దక్కించుకుంది.
ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ రూ.8.60 కోట్లకు లక్నో సొంతమయ్యాడు. అతడి కోసం లక్నో, హైదరాబాద్ పోటీపడ్డాయి. భారత అన్క్యాప్డ్ ఆల్రౌండర్ ఆకిబ్ దార్కు కాసుల వర్షం కురిసింది. రూ.8.40 కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. భారత్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ని రూ.7.20 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను రూ.7 కోట్లకు గుజరాత్, భారత బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ను రూ.7 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
Also Read: Off The Record: ప్రధాని చెప్పినా ఎంపీల్లో ఒకరు లీక్ చేశారా?.. అనుమానపు చూపులు ఎటువైపు?
టాప్-5 ప్లేయర్స్ లిస్ట్ ఇదే:
# కామెరాన్ గ్రీన్, రూ.25.20 కోట్లు, కేకేఆర్
# మతిషా పతిరనా, రూ.18 కోట్లు, కేకేఆర్
# ప్రశాంత్ వీర్, రూ.14.2 కోట్లు, సీఎస్కే
# కార్తీక్ శర్మ, రూ.14.20 కోట్లు, సీఎస్కే
# లియామ్ లివింగ్స్టోన్ రూ.13 కోట్లు, హైదరాబాద్