Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. రెండో వన్డేలోనూ టీమిండియా ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన నేపథ్యంలో ఈ వన్డేలో అతడు ఓపెనింగ్కు వస్తాడా లేదా మిడిలార్డర్లోనే వస్తాడా అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. ఆసియాకప్కు ముందు అతడు ఫామ్లోకి రావాలని జట్టు కోరుకుంటోంది. అటు ఆడుతోంది పసికూన జింబాబ్వేతో అయినా టీమిండియా రక్షణాత్మక ధోరణి అవలంభిస్తుండటం అభిమానులకు నచ్చడం లేదు. తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకుండా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకోవడమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Boycott Amazon: శ్రీకృష్ణుడిని అవమానించిన అమెజాన్.. బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్
ఇటీవల బంగ్లాదేశ్తో ప్రదర్శన చూశాక జింబాబ్వే టీమిండియాకు కనీస పోటీ ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ తొలి వన్డేలో 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులైనా జింబాబ్వే చేస్తుందా అని చాలా మంది సందేహించారు. అయితే టెయిలెండర్ల ప్రతిభ కారణంగా 190 పరుగుల టార్గెట్ను జింబాబ్వే నిర్దేశించింది. ఈ టార్గెట్ను భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించినా మరీ నెమ్మదిగా ఆడారంటూ ధావన్-గిల్ విమర్శలను ఎదుర్కొన్నారు. జింబాబ్వే లాంటి జట్టుపైనా రిస్క్ చేసి ఆడకపోతే టీమిండియా ఎందుకంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఈ మధ్య టీమ్ అప్రోచ్ మారిందని, దూకుడే మంత్రంగా జట్టు ముందుకు సాగుతుందని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ పదే పదే చెప్పారు. కానీ జింబాబ్వేతో తొలి వన్డేలో అలాంటి సీన్ కనిపించలేదు. అటు ఏ మాత్రం పసలేకుండా సాగిన తొలి వన్డే మ్యాచ్ అభిమానులకు తీవ్ర బోర్ కొట్టించింది. కాగా ఇవాళ్టి మ్యాచ్ మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలి వన్డేలో దిగిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుంది.