IND Vs AUS: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా చెలరేగిపోయింది. 91 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రాహుల్ (10) నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ 11 పరుగులకు అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే చివరి ఓవర్లో స్ట్రైకింగ్కు వచ్చిన దినేష్ కార్తీక్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపాకు 3 వికెట్లు పడగా కమిన్స్ ఓ వికెట్ సాధించాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. కీలకమైన మూడో టీ20 ఈ నెల 25న హైదరాబాద్లో జరగనుంది.
Read Also:IND Vs AUS: రెండో టీ20 8 ఓవర్లకు కుదింపు.. టాస్ గెలిచిన టీమిండియా
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. మైదానం చిత్తడిగా ఉండడంతో ఈ మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తన ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి దూకుడుగా ఆడాడు. వేడ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఫించ్ 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.