టీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం అధికారికంగా ఐసీసీకి ఇంకా ఏమీ చెప్పలేదు. మ్యాచ్ ఆడకుంటే కఠిన చర్యలు తప్పవని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. అయితే మొన్నటి వరకు బీరాలకు పోయిన పీసీబీ.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న పీసీబీ.. భారత్తో మ్యాచ్కు తాము సిద్ధమంటూ, మూడు కీలక డిమాండ్లను ముందుంచినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్స్ ఏవో చూద్దాం.
తాజా సమాచారం ప్రకారం.. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది ఐసీసీ రెవెన్యూలో ఎక్కువ వాటా. భారత జట్టు మ్యాచ్ల వల్ల ఐసీసీకి భారీ ఆదాయం వస్తున్న నేపథ్యంలో.. ఆ లాభాల్లో తమకు కూడా ఎక్కువ శాతం ఇవ్వాలని పీసీబీ కోరుతోందని సమాచారం. రెండో డిమాండ్ సంచలనం అనే చెప్పాలి. అదే భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ. గత కొన్నేళ్లుగా రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. భారత్తో ఆడేది లేదు అని ప్రకటించిన పీసీబీ.. ఇప్పుడు మాత్రం ద్వైపాక్షిక సిరీస్ కావాలని కోరడం విశేషం.
Also Read: Sanju Samson: రెండు ప్రపంచకప్లు, 10 మ్యాచ్లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
మూడో డిమాండ్ హ్యాండ్షేక్ ప్రోటోకాల్. మ్యాచ్ ముందు, తర్వాత భారత ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్షేక్ చేయాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఐసీసీ పాకిస్థాన్ కోరుతోంది. ఇది స్పోర్ట్స్మన్షిప్ పేరుతో పెట్టిన డిమాండ్ అయినా.. దీనిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ డిమాండ్లపై ఐసీసీ, బీసీసీఐ ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. కోట్లాది అభిమానుల భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ ఈవెంట్. కానీ ఆ మ్యాచ్కు షరతులు పెట్టడం ఎంతవరకు సరైనదన్న చర్చ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది.
