భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్మించిన పటిష్టమైన దేశీవాళీ క్రికెట్ నిర్మాణానికి ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ తాజా నిదర్శనమని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కొనియాడారు. అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల తేడాతో రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.
తొలి టెస్టులోనే సుతార్ సంచలనం..
ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో సహా మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా, సరైన వేగంతో బంతిని టర్న్ చేస్తూ సుతార్ రాణించిన తీరును కోటక్ ప్రశంసించారు. కేవలం బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ సుతార్ సహకారాన్ని అందించడం జట్టుకు మరింత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
“గత 3-4 ఏళ్లుగా ఇండియా-ఎ, ఎమర్జింగ్ జట్లలో మానవ్ స్థిరంగా రాణిస్తున్నాడు. వయసు పరిమితి క్రికెట్, రంజీ ట్రోఫీ, ఇండియా-ఎ వంటి పటిష్టమైన వ్యవస్థ ద్వారా రాటుదేలి అంతర్జాతీయ స్థాయికి రావడం వల్లే ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించగలుగుతున్నారు” అని కోటక్ వివరించారు.
మరో స్పిన్నర్ హర్ష్ దూబే కంటే సుతార్కే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఇది కెప్టెన్, హెడ్ కోచ్ నిర్ణయమని… అయితే మానవ్ గత కొంతకాలంగా క్యాంపుల్లో, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో తన ప్రతిభను నిరూపించుకున్నాడని తెలిపారు.
వాషింగ్టన్ సుందర్ పై ప్రశంసలు..
ఇదే సమయంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పనితీరు, క్రమశిక్షణను కోటక్ ప్రత్యేకంగా ప్రశంసించారు. 2017 నుంచి జట్టులో ఉన్న సుందర్, జట్టులో స్థానం దక్కినా దక్కకపోయినా ఒకే రకమైన సానుకూల వైఖరిని ప్రదర్శిస్తాడని కొనియాడారు. పవర్ప్లేలో బౌలింగ్ చేయగల సామర్థ్యం, అద్భుతమైన టెంపరామెంట్ అతని సొంతమని, సుందర్ మానసికంగా ఎంతో పరిణతి సాధించాడని కోటక్ ముగించారు.

