2027 వన్డే ప్రపంచకప్నకు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా టీమిండియా 2026 చివరలో న్యూజీలాండ్లో ఒక భారీ సిరీస్ ఆడనుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య జరిగే ఈ పర్యటనలో మొత్తం 12 మ్యాచ్లు (2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు) జరుగుతాయి. న్యూజీలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ కానుంది. భారత్, న్యూజీలాండ్ దేశాల మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాల గుర్తుగా ఈ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు.
కోహ్లీ, రోహిత్లకు కీలకమైన సిరీస్
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (37 ఏళ్లు), రోహిత్ శర్మ (39 ఏళ్లు) తమ కెరీర్ చివరి దశకు చేరుకున్నారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్లో ఆడటమే వీరి లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ 5 మ్యాచ్ల వన్డే సిరీస్ వారికి చాలా కీలకం కానుంది. న్యూజీలాండ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లో వీరు రాణిస్తే, ప్రపంచకప్ జట్టులో వీరి స్థానంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి. 2025 చివరలో ఆస్ట్రేలియా పర్యటన తరహాలోనే, న్యూజీలాండ్లో కూడా వీరు ఆడబోయే చివరి సిరీస్ ఇదే కావచ్చు.
మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే.. 1వ టీ20: అక్టోబర్ 22 – క్రైస్ట్చర్చ్, 2వ టీ20: అక్టోబర్ 24 – క్రైస్ట్చర్చ్, 3వ టీ20: అక్టోబర్ 27 – వెల్లింగ్టన్, 4వ టీ20: అక్టోబర్ 30 – ఆక్లాండ్, 5వ టీ20: నవంబర్ 1 – హామిల్టన్ లో నిర్వహిస్తారు. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే.. 1వ వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్, 2వ వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్, 3వ వన్డే: నవంబర్ 10 – హామిల్టన్, 4వ వన్డే: నవంబర్ 13 – మౌంట్ మాంగనుయ్, 5వ వన్డే: నవంబర్ 15 – మౌంట్ మాంగనుయ్ లో జరగనుంది. టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే.. 1వ టెస్ట్: నవంబర్ 19 నుండి 23 – వెల్లింగ్టన్, 2వ టెస్ట్: నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 – క్రైస్ట్చర్చ్ లో నిర్వహిస్తారు.
సుదీర్ఘ విరామం తర్వాత 2019-20 సీజన్ తర్వాత భారత్, న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్ల ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భారీ ఏర్పాట్లు చేస్తోంది. పంజాబ్లో పుట్టి న్యూజిలాండ్లో పెరిగిన స్పిన్నర్ ఇష్ సోధి ఈ పర్యటన గురించి మాట్లాడుతూ.. భారత జట్టుతో ఆడటం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతి అని, భారత అభిమానులు తెచ్చే ఉత్సాహం మైదానంలో అద్భుతంగా ఉంటుందని అన్నాడు.
