Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!

  • ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్‌
  • అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే
  • మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్
Vaibhav Sooryavanshi, India A

Vaibhav Sooryavanshi, India A

Vaibhav Sooryavanshi Eyes Big Impact for India A: భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. శ్రీలంకలో ఈరోజు ప్రారంభమయ్యే ట్రై సిరీస్‌లో వండర్ కిడ్ ఇండియా-ఏ తరఫున బరిలోకి దిగనున్నాడు. మరికొద్ది గంటల్లో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్‌ ఆరంభం కానుండగా.. 15 ఏళ్ల ఈ బ్యాటింగ్ సంచలనం ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ నెల చివర్లో జరగనున్న ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ వైభవ్‌కు అత్యంత కీలకంగా మారింది.

ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన వైభవ్:
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్‌లో తనడైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన బుడ్డోడు.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

×
×
Ad

నెట్స్‌లో రక్షణాత్మక షాట్స్:
శ్రీలంక-ఏతో దంబుల్లాలో జరిగే మ్యాచ్‌కు ముందు జరిగిన నెట్ సెషన్‌లో వైభవ్ కొంత సమయం రక్షణాత్మక బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. సాధారణంగా దూకుడైన ఆటకు పేరుగాంచిన అతడు పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అభిమానులు మాత్రం అతడి దూకుడైన షాట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తిలక్ వర్మ ప్రశంసలు:
వైభవ్‌పై ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీస్ వైభవ్‌కు పెను పరీక్షగా మారుతుందని పేర్కొన్నాడు. ఈ ఏడాది అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్.. ఇప్పుడు మరింత ఉన్నత స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతడి ముందుంది చెప్పాడు.

టీ20లలో ఇప్పటికే విధ్వంసం:
టీ20 ఫార్మాట్‌లో ఇప్పటికే తన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ క్రికెట్‌లో వేగంగా ఎదుగుతున్న యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడి దూకుడైన శైలి, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం భారత క్రికెట్ వర్గాల్లో అంచనాలు పెంచాయి. ఇప్పుడు శ్రీలంక-ఏ, ఆ తర్వాత అఫ్గానిస్థాన్-ఏ జట్లపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.

ఇండియా-ఏ తరఫున ఇప్పటికే చరిత్ర:
గత ఏడాది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్‌లో యూఏఈపై ఇండియా-ఏ తరఫున వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు బాదిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు.. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.