India Playing 11 vs South Africa in T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈరోజు నుంచి సూపర్-8 మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. నేడు కొలంబోలో పాకిస్తాన్, న్యూజీలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఇక భారత్, దక్షిణాప్రికా జట్లు ఆదివారం (ఫిబ్రవరి 22) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ఈ రెండు తలపడగా.. భారత్ గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరోసారి దక్షిణాప్రికాపై గెలిచి సూపర్-8లో ముందడుగు వేయాలని టీమిండియా చూస్తోంది. భారత్పై గెలిచి ఫైనల్ ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీలు చుస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్కు ముందు టీమిండియా నెట్ ప్రాక్టీస్లో ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. ముఖ్యంగా కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అహ్మదాబాద్లో సుదీర్ఘ సమయం నెట్స్లో చెమటోడ్చాడు. సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న తీరు చూస్తుంటే.. దక్షిణాఫ్రికా మ్యాచ్లో ప్లేయింగ్ 11లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు తిలక్ వర్మ స్థానంలో అతడు ఆడే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని మ్యాచ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో.. తెలుగు ఆటగాడు తిలక్ను పక్కన పెట్టి సంజూకు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వరుసగా మూడు డకౌట్స్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మపై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచనుంది. సూపర్-8 లాంటి కీలక దశలో అతడు లయ అందుకుంటే టీమిండియాకు మంచి ఆరంభం దక్కుతుంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే మెరుపులు మెరిపిస్తున్నాడు. కిషన్ నుంచి మరో కీలక ఇన్నింగ్స్ జట్టు కోరుకుంటోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పరుగులు చేస్తుండడం కలిసొచ్చే అంశం. ఇక హిట్టర్ శివమ్ దూబే మంచి దూకుడు మీదున్నాడు. అతడు బాదే సిక్సులు చూస్తే మతిపోతోంది. రింకూ సింగ్ తనకు వచ్చిన అవకాశాల్లో రఫ్ఫాడిస్తున్నాడు.
Also Read: Usman Tariq Controversy: భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?.. పాక్ బౌలర్ తారిక్ ఫైర్!
బౌలింగ్ లైనప్లో కూడా కొన్ని అనూహ్య మార్పులు జరిగనున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ డెప్త్తో పాటు పొదుపైన బౌలింగ్ కోసం అక్షర్ వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోందట. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పిచ్ కండిషన్స్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అవసరం దృష్ట్యా అర్ష్దీప్ను తుది జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంబీర్ భావిస్తున్నారట. బుమ్రా, చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఢీకొట్టడానికి ఈ మార్పులు అవససరం అని ఫాన్స్, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జట్టు మార్పులలో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
భారత్ ఫైనల్ టీమ్:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.
