ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ప్రారంభించనుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది. జట్టు దూడుగా ఆడేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. టోర్నీ తొలి మ్యాచ్ (పాకిస్థాన్) నుంచే ‘ఫియర్లెస్ క్రికెట్’ ఆడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రపంచకప్కు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడింది. వెస్టిండీస్పై ఘన విజయం సాధించిన భారత్.. ఆతిథ్య ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్ వరకు పోరాడి ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ ఈ మ్యాచ్లు జట్టులో విశ్వాసాన్ని పెంచాయని హర్మన్ప్రీత్ తెలిపింది.
ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 36 బంతుల్లో 68 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె ఇన్నింగ్స్ జట్టుకు పెద్ద సానుకూల అంశమని కెప్టెన్ హర్మన్ప్రీత్ పేర్కొంది. క్రీజులో నిలబడగలిగితే మ్యాచ్ను ఎప్పుడైనా తమవైపు తిప్పుకునే సామర్థ్యం ఉందనే నమ్మకం రిచా ఇన్నింగ్స్తో పెరిగిందని తెలిపింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ పోరాడినా విజయానికి చేరుకోలేకపోయింది. దీనిపై స్పందించిన హర్మన్ప్రీత్.. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమవడం వల్లే ఓటమి ఎదురైందని అంగీకరించింది.
‘టీ20 క్రికెట్లో భాగస్వామ్యాలు చాలా కీలకం. రిచా అద్భుతంగా ఆడినా మిగతా బ్యాటర్లు ఆమెకు సరైన సహకారం అందించలేకపోయారు. అయితే ఆమె ప్రదర్శన జట్టుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జట్టులోని ప్రతి ఒక్కరికి అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే వార్మప్ మ్యాచ్ల్లో మార్పులు చేశాం. టోర్నీకి ముందు అందరూ మ్యాచ్ ప్రాక్టీస్ పొందడం జట్టుకు ఉపయోగపడుతుంది’ అని హర్మన్ప్రీత్ చెప్పారు. గ్రూప్-ఏలో భారత్తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. టోర్నీ తొలి మ్యాచ్నే పాకిస్థాన్తో ఆడాల్సి రావడం పట్ల హర్మన్ప్రీత్ ఉత్సాహం వ్యక్తం చేసింది.
‘బర్మింగ్హామ్లో పాకిస్థాన్తో ప్రపంచకప్ ప్రారంభించడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది?. స్టేడియంలో అద్భుత వాతావరణం ఉండబోతోంది. ఆ మ్యాచ్ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని హర్మన్ప్రీత్ చెప్పింది. భారత మహిళల జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ గెలవలేదు. 2020లో ఫైనల్ చేరడం భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఆ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈసారి చరిత్ర సృష్టించి తొలి ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది.
ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నీగా నిలవనుంది. తొలిసారిగా 12 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 33 మ్యాచ్లు ఇంగ్లండ్లోని ఏడు వేదికల్లో జరగనున్నాయి. జూన్ 30, జూలై 2 తేదీల్లో సెమీఫైనల్స్ జరగగా.. జూలై 5న లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
మహిళల టీ20 ప్రపంచకప్కు భారత జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

