టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఉద్రిక్తత మ్యాచ్ సమయంలో చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా స్ట్రైక్లో ఉన్న మిచెల్ వైపు అర్ష్దీప్ బంతిని విసరడంతో మైదానంలో కాస్త టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనతో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. అయితే పరిస్థితిని అంపైర్లు నియంత్రించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిచెల్తో మాట్లాడగా, అర్ష్దీప్తో అంపైర్ చర్చించడంతో పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత డారిల్ మిచెల్ను అర్ష్దీప్ సింగ్ కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా మిచెల్కు అర్ష్దీప్ క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఐసీసీ కూడా ఈ సంఘటనపై చర్యలు తీసుకుంది. అర్ష్దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అది పెద్ద సమస్య కాదని, మిచెల్కు అర్ష్దీప్ సారీ చెప్పనక్కర్లేదన్నాడు.
ఓ జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘అది పెద్ద సమస్య కాదు. దేశం తరఫున ఆడేటప్పుడు ఆటగాళ్లలో దూకుడు ఉండాలి. ఒక బౌలర్ వరుసగా రెండు సిక్స్లు ఇవ్వాలని అనుకోడు. ఆ పరిస్థితిలో అర్ష్దీప్ బంతిని విసరడం సహజమే. నా ఆటగాళ్ల నుంచి కూడా నేను ఇలాంటిదే ఆశిస్తాను. అందులో తప్పు ఏమీలేదు. మైదానంలోకి దిగిన తర్వాత ఎవరూ స్నేహితులు కాదు, శత్రువులు కూడా కాదు. దేశం కోసం ఆడేటప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పెద్ద వివాదంగా చూపిస్తున్నారు. అది అవసరం లేదు’ అని స్పష్టం చేశాడు.
