Harshit Rana Selection Row: ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్లలో పేసర్ హర్షిత్ రాణా ఎంపిక కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడని హర్షిత్కు నేరుగా జాతీయ జట్టులో చోటు కల్పించడంపై మాజీ భారత క్రికెటర్ సదగోప్పన్ రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బీసీసీఐ గతంలో అనుసరించిన విధానాలకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? అంటూ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను ప్రశ్నించారు.
ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు:
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ హర్షిత్ రాణాను మూడు జట్లలోనూ ఎంపిక చేయడం ఆశ్చర్యకరమని సదగోప్పన్ రమేష్ పేర్కొన్నారు. మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ 2026తో పాటు ఐపీఎల్ 2026 సీజన్ ఆడని హర్షిత్.. శస్త్రచికిత్స అనంతరం పోటీ క్రికెట్ ఆడకుండానే జట్టులోకి రావడం వెనక ఎవరున్నారు అని బీసీసీఐని సూటిగా ప్రశ్నించారు. ‘హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు?. అతను గాయం తర్వాత ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మహ్మద్ షమీ లేదా ఇతర ఆటగాళ్లు ఏమనుకుంటారో ఊహించండి’ అని రమేష్ చెప్పుకొచ్చారు.
శ్రేయస్ అయ్యర్ కూడా ఆడాడు:
భారత జట్టులోకి తిరిగి రావాలంటే గాయపడిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో తమ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని గతంలో బీసీసీఐ స్పష్టమైన రూల్స్ అమలు చేసిందని రమేష్ గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లకైనా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని చెప్పారని.. హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లకు కూడా గాయం తర్వాత తమ ఫిట్నెస్ నిరూపించుకోవాలని సూచించారని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా న్యూజిలాండ్ వన్డే సిరీస్కు ముందు విజయ్ హజారే ట్రోఫీలో ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్న తర్వాతే జట్టులోకి ఎంపికయ్యాడని చెప్పుకొచ్చారు.
హర్షిత్కు ఏ నిబంధనలు లేవు:
‘ఒక ఆటగాడు గాయం నుంచి కోలుకుని భారత జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్లో తన ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకోవాలనే సంప్రదాయాన్ని సెలెక్టర్లు ఏర్పరిచారు. కానీ హర్షిత్ విషయంలో మాత్రం ఏ నిబంధనలు లేవు’ అనిరమేష్ విమర్శించారు. టీ20 ప్రపంచ కప్కు ముందు వార్మప్ మ్యాచ్లో గాయపడిన హర్షిత్ రాణా టోర్నీ మొత్తాన్ని దూరం అయ్యాడు. అనంతరం శస్త్రచికిత్స చేయించుకుని పునరావాస ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ.. ఇప్పటివరకు పోటీ మ్యాచ్ల్లో పాల్గొనలేదు. ఇతర ఆటగాళ్లకు వర్తించిన ప్రమాణాలు అతనికి కూడా వర్తించాలనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ఎంపికపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ నుంచి అధికారిక వివరణ వస్తుందా లేదా అన్నది చూడాలి.

