కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. 124 పరుగులను ఛేదించలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు కూడా టీమిండియాకు పరాజయాలు ఎదురయ్యాయి. వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం ప్రయోగాలు చేసే గౌతీని తప్పించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పదించింది. గంభీర్పై పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ అతడికి మద్దతుగా నిలిచింది.
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ… ‘ప్లేయర్స్, సెలక్టర్లు, హెడ్ కోచ్, కోచింగ్ బృందంపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే వారు బాగా రాణిస్తున్నారు. ఏదో ఒక మ్యాచ్ ఓడిపోతే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. విమర్శలను మేం పెద్దగా పట్టించుకోము. ఇప్పుడున్న జట్టుతోనే మనం ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచాం. ఇటీవలి కాలంలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్లో సిరీస్ సమం అయింది. స్వదేశంలో ఒక్క మ్యాచ్ ఓడగానే విమర్శలు చేస్తున్నారు. గంభీర్ మీద మాకు పూర్తి నమ్మకముంది’ అని చెప్పారు.