టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ హెడ్ కోచ్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్, జయవర్ధనే వంటి విదేశీ హెడ్ కోచ్ల నేతృత్వంలో ఆయా జట్లు ఐసీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అయితే.. తొలిసారి భారత హెడ్ కోచ్ నేతృత్వంలో ఓ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. అదే.. గుజరాత్ టైటాన్స్!
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన్ ఫైనల్ మ్యాచ్లో.. రాజస్థాన్ రాయల్స్ను ఓడించి, గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఈ జట్టుకి హెడ్ కోచ్గా నేహ్రా బాధ్యతలు నిర్వహించాడు. ఈ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది సీజన్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్లోనే కప్ కొట్టడం, దానికి ఇండియన్ హెడ్ కోచ్ ఉండడంతో, అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతరుల్లా ల్యాప్టాప్, ఫోన్స్ వంటి డివైజ్లను వినియోగించకుండా.. కేవలం పేపర్, పెన్లతోనే వ్యూహాలు రచిస్తూ.. జట్టును గెలిపించుకున్నాడంటూ నెటిజన్లు నేహ్రాని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇదిలావుండగా.. ఇప్పటివరకూ అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న హెడ్ కోచ్ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆయన కోచింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. రెండో స్థానంలో మహేల జయవర్ధనే ఉన్నాడు. అతని కోచింగ్లో ముంబై జట్టు మూడు టైటిల్స్ సొంతం చేసుకున్నాడు.