ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగినప్పుడు.. టిడిపి నేతలు,శ్రేణులు పాల్గొనేవారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబసభ్యులు.. ఇటు తెలంగాణ టిడిపి శ్రేణులు జయంతి ,వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్బంగా తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరిగింది.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మారుతూ వచ్చాయి. తెలంగాణలో క్రమంగా టిడిపి పార్టీ నుంచి ఎన్నికయిన ఎమ్మెల్యేలు …అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
ఈ పరిణామాలు 2014 ,2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్నాయి. నేతల వలసలతో దాదాపు టీడీపీ ఖాళీ అయిందనే చెప్పాలి.. తెలంగాణలో టీడీపీ ఉండీ లేనట్టు తయారైంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో.. గులాబి పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్న పరిస్థితులు చాలా తక్కువ. ఒకవేళ అడపాదడపా ఒకరిద్దరు పాల్గొన్నా కూడా.. పెద్దగా హడవుడి చేసే వారు కాదు. కాని, ఈసారి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా టిడిపిలో ఎక్కువ కాలం రాజకీయ ప్రయాణం చేసిన నేతలు.. జయంతి వేడుకల్లో యాక్టివ్ గా పాల్గొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే వీటన్నీంటికి టిఆర్ఎస్ పార్టీ అనుమతి ఇచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీ అనుమతి లేకుండా నేతలు జయంతి వేడుకల సందర్బంగా హడావుడి చేసే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు నివాళులు అర్పించారు. సియం కేసిఆర్ ను కూడా ఆహ్వనించారు అన్న చర్చ కూడా గులాబి పార్టీ వర్గాల్లో జరిగింది. తెలంగాణలో ఎన్టీఆర్ పోలిటికల్ లెగసీ కోసం నేతలు ప్రయత్నాలు ప్రారంభించారా అన్న చర్చ కూడా మొదలైంది. తెలంగాణలో టిడిపి రాజకీయంగా బలహీన పడుతుండంతో.. పోలిటికల్గా ఖాళీ అవుతున్న ఆ స్పేస్ను ఎన్టీఆర్ను ఓన్ చేసుకోవడం ద్వారా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అన్న లెక్కలు వేసుకుని ఉండవచ్చు. ఇటు గ్రేటర్ హైదరబాద్ తో పాటు జిల్లాలో పలు చోట్ల బలంగా ఉన్న ఒక సామాజిక వర్గానికి దగ్గర అయ్యే ప్రయత్నంగా కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. గతంలో రాజకీయంగా బలపడేందుకు వ్యూహాత్మకంగా టీడీపీని టార్గెట్ చేసింది గులాబీపార్టీ. అందులో ఉన్న కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారికి పదవులు కూడా కట్టబెట్టింది. పైగా ఇతర ఉమ్మడి ఏపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు కానీ.. ఎప్పుడూ ఎన్టీఆర్పై ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. ఇవన్నీ రాజకీయ వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్ అమలు చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొనడం అందులో భాగమేనా అన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమకు టిడిపితో గతంలో ఉన్న అనుబందంతోనే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గోంటున్నామన్నారు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. మరి టిఆర్ఎస్ నేతల ప్రయత్నాలు రాజకీయంగా ఎటువంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.