మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ గడువు ఈ నెల 6తో ముగిసింది. అయితే రిమాండ్ ముగియక ముందే ఆన్లైన్లో విచారణకి హాజరవుతానని మెజిస్ట్రేట్ను అభ్యర్థించారు ఎమ్మెల్సీ. ప్రజాప్రతినిధి కావడంతో భద్రతను కారణంగా చూపారు. కేసు తీవ్రత దృష్ట్యా మెజిస్ట్రేట్ ఎమ్మెల్సీ అభ్యర్థనను తిరస్కరించారు. ఇంకేముందీ అనంతబాబు కోర్టుకి హాజరవడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో జిల్లాలో ఆ కేసును విచారించే కోర్టు రాజమండ్రిలోనే ఉంది. ఆ కోర్టుకు వేసవి సెలవులు కావడంతో పిఠాపురంలోని వెకేషన్ జడ్జి కోర్టులో విచారణ నిర్వహించారు. ఇక్కడే ఎమ్మెల్సీతో పరిచయం ఉన్న కొందరు అధికారులు తమ బుర్రకు పదును పెట్టారని చెవులు కొరుక్కుంటున్నారు.
కోనసీమ అల్లర్ల తర్వాత అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. మెజారిటీ పోలీసులు వెళ్లడంతో.. ఎమ్మెల్సీ భద్రతకు సిబ్బంది సరిపోరనే వెసులుబాటు అస్త్రాన్ని బయటకు తీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా ఆన్లైన్లోనే ఎమ్మెల్సీని హాజరుపరిచారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రకరకాల కథాలు ప్రచారంలో ఉన్నాయి. అనంతబాబుకు బయట మీడియాకు కనిపించడం ఇష్టం లేదట. అదే జరిగితే మొత్తం అటెన్షన్ తనవైపు తిరుగుతుందని.. కేసు మరింత హైలైట్ అవుతుందని అనుకున్నారట. దానికి తగ్గట్టుగానే తనకు పరిచయం ఉన్న అధికారులతో కథ నడిపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ విషయంలో గోప్యతపై ప్రశ్నలు సంధిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అనంతబాబును కోర్టులో హాజరుపరిచేందుకు సాంకేతిక అంశాలు కలిసొచ్చినా.. తదుపరి విచారణకు అయినా బయటకు తీసుకురావాలి కదా అని కొందరి ప్రశ్న. అప్పుడు కూడా ఏదో ఒకసాకు దొరక్కపోతుందా అనేది ఎమ్మెల్సీ వర్గం ఆశ. మొత్తానికి ఎమ్మెల్సీతో పరిచయం ఉన్న అధికారులు నక్కకి నాకలోకానికి లింకుపెట్టడం ప్రస్తుతం చర్చగా మారింది. ఇంత వరకు కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదనే విపక్షాల ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదట.