ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ఉలుకు లేదు.. పలుకు లేదు. అంతా బీ.. కామ్. అనుచరులకు కూడా తమ నేతలో వచ్చిన మార్పు అర్థం కావడంలేదట. ఆయనకేమైంది? ఎవరా నాయకుడు? ఏమా కథ?
కీలక అంశాలపై పెదవి విప్పని చెవిరెడ్డి!
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోందట. విపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతి అంశంలోనూ దూకుడు ప్రదర్శించిన ఆ చెవిరెడ్డి.. ఈ చెవిరెడ్డి ఒకరేనా అనే పరిస్థితి అనుచరుల్లో ఉందట. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు.. తుడా ఛైర్మన్, ప్రభుత్వ విప్. గడిచిన రెండున్నరేళ్లుగా చెవిరెడ్డి చర్చల్లోకి వచ్చిన సందర్భాలూ అరుదుగానే ఉన్నాయి. ఇటీవల ఆనందయ్య కరోనా మందు పంపిణీ ద్వారా ప్రచారంలోకి వచ్చారు. వైజాగ్ స్టీల్ప్లాంట్, పులిచింతల గేటు కొట్టుకుపోవడం.. అమరరాజా ఫ్యాక్టరీ వివాదాల్లో చెవిరెడ్డి నుంచి నో రియాక్షన్. దీంతో తమ నేతకు ఏమైంది? ఎందుకు మాట్లాడటం లేదని ఆరా తీస్తున్నారట అభిమానులు.
అమరరాజా వివాదంలో చెవిరెడ్డి సైలెంట్!
రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. జిల్లా నుంచి మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యే రోజా వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. మిగతా అంశాలు పక్కన పెడితే అమరరాజా ఫ్యాక్టరీ విషయంలో చెవిరెడ్డి వైఖరి ఏంటన్నది ఆసక్తిగా మారింది. కానీ.. ఆయన పెదవి దాటి ఒక్క మాట రాలేదు. అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది చంద్రగిరి నియోజకవర్గానికి చెందినవారే. అయినప్పటికీ ఎక్కడా చిన్నమాట కూడా జారకుండా జాగ్రత్త పడుతున్నారట ఎమ్మెల్యే. ఆయన అనుచరులు మాత్రం.. కార్మికుల దగ్గరకు వెళ్లి.. అన్న చూసుకుంటాడులే అని ధైర్యం చెబుతున్నారట. ఇదే ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వంపై చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు మాటల దాడులు చేస్తున్నా.. చెవిరెడ్డి కిమ్మనడం లేదు.
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి.. విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు!
అమరరాజా రగడలో చెవిరెడ్డి సైలెంట్గా ఉండటం కేడర్ తట్టుకోలేకపోయిందట. డైరెక్టుగా ఆయన్నే అడిగేసినట్టు సమాచారం. అక్కడ కూడా కేడర్ చెప్పింది విన్నారే కానీ.. రిప్లయ్ ఇవ్వలేదట ఎమ్మెల్యే. అధికారంలో ఉన్నప్పుడు వివాదాలు.. ధర్నాలు, విమర్శలు చేస్తే.. నియోజకవర్గంలో అభివృద్ధిని ఎవరు పట్టించుకుంటారు అని సన్నిహితుల దగ్గర చెవిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై .. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలపై ఫోకస్ పెట్టాలని తన మనసలో మాట బయటపెట్టారట చెవిరెడ్డి. పార్టీ అధినేత తనకు ఒకటికి మూడు నాలుగు పదవులు ఇచ్చింది పనిచేయడానికి కానీ.. గొడవలు చేయడానికి కాదని సూటిగా సుత్తిలేకుండా చెప్పినట్టు తెలుస్తోంది. అంతగా నోరు విప్పాల్సి వస్తే.. ఆ టైమ్ వచ్చినప్పుడు చూసుకుందామని బదులిచ్చారట ఎమ్మెల్యే.
కేడర్లో ఉన్న అనుమానాలకు చెవిరెడ్డి క్లారిటీ ఇచ్చారా?
సన్నిహితుల దగ్గర చెవిరెడ్డి వెల్లడించిన ఈ అంశాలు ఆ నోటా ఈ నోటా కేడర్కు, అనుచరులకు చేరాయి. దాంతో మా నాయకుడి స్టయిల్ మారిందే అని అనుకుంటున్నారట. పైగా కేడర్లో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు ఒక్కమాటతో ఎమ్మెల్యే చెవిరెడ్డి చెక్ పెట్టారని టాక్ నడుస్తోంది. కొందరు అనుచరులు మాత్రం.. తమ నేత దూకుడును పక్కన పెట్టి కామ్గా ఉండటం నచ్చడం లేదట. మరి.. అలాంటి అనుచరుల కోసం చెవిరెడ్డి వైఖరి మార్చుకుంటారో లేక.. కొత్త తరహాలోనే ముందుకెళ్తారో చూడాలి.