OTR: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇసుక దుమారం రేగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి నాలుగు రోజుల క్రితం ఒక ప్రధాన ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుల మీద కేసులు బుక్ అయ్యాయి. ఈ వ్యవహారంలో 8 మందిపై కేసులు పెడితే… అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. భార్యాభర్తలు, కొడుకు…. ఇలా ఆ ముగ్గురూ సత్తుపల్లిలోని అధికార పార్టీ ముఖ్యనేతకు కావాల్సిన వాళ్ళు అవడం ఇంకా సంచలనమైంది. కొద్ది రోజులుగా సత్తుపల్లి ఏరియాలో ఇసుక అక్రమ రవాణా అడ్డసుడిగా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. పోలీసులు కేసులు బుక్ చేస్తున్నా… అవి చిన్న వాళ్ళమీదే ఉంటున్నాయి. కానీ… మొట్టమొదటిసారి ఇప్పుడు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడి పైనే కేసు నమోదవడంతో… అందరి దృష్టి ఒక్కసారిగా ఇటువైపు మళ్ళింది. అంతకు మించి మహిళను కూడా నిందితురాలిగా చేర్చడంతో సత్తుపల్లి కాంగ్రెస్లో ఏం జరుగుతోందంటూ ఆరాలు పెరిగిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజాప్రతినిధులు భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అక్రమాలను సహించేది లేదని, ఇసుక, మట్టి దందాల్లో ఎవ్వరున్నా ఒప్పుకోబోమని బహిరంగ వేదికల మీదే ప్రకటించేశారు. తీరా… ఇప్పుడు అలాంటి నాయకుల అనుచరుల మీదే కేసులు నమోదవడం చర్చనీయాంశమైంది.
READ ALSO: OTR: ప్రభుత్వం టార్గెట్గా పొలిటికల్ హీట్ పెంచుతున్న ప్రతిపక్షం..!
ఇందుకు అధికార పార్టీలోని వర్గ విభేదాలే కారణమా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట చాలామందికి. అదే సమయంలో సత్తుపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళడం కూడా మరో రీజన్ అయి ఉండవచ్చంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీ సరిహద్దులో ఉంటుంది. అక్కడ ఇసుక ఉచితం. దీన్ని ఆసరా చేసుకుని టిప్పర్ల ద్వారా ఇసుకను ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు తరలిస్తున్నారు కొందరు. తాజాగా సీజ్ అయిన టిప్పర్లు కూడా ఆ బాపతువే. మూడు వాహనాలను సీజ్ చేసి 8 మందిపై కేసు పెట్టారు అధికారులు. ఏపీలోని కొవ్వూరు ర్యాంప్ నుంచి ఈ ఇసుక వచ్చినట్టు గుర్తించారు. గడిచిన ఆరు నెలల్లో ఇలా కోట్ల రూపాయల విలువైన ఇసుకను సరిహద్దు దాటించి తెలంగాణకు అక్రమంగా తరలించినట్టు లెక్కలు కడుతున్నారు ఆఫీసర్స్. తూర్పు గోదావరి జిల్లాలోని ఎర్రగుంటపల్లి, విస్సన్నపేట నుంచి రోజుకు 50 లారీల గోదావరి ఇసుక ఇక్కడికి వస్తోందట.
ప్రాథమికంగా దీని బేస్ సత్తుపల్లే అయినా… ఈ నెట్వర్క్ హైదరాబాద్ దాకా విస్తరించినట్టు చెబుతున్నారు. ఈ అక్రమ రవాణాలో అధికార పార్టీ నాయకుల ప్రధాన అనుచరులే కీలకంగా ఉండటంతో…. పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్నది ఖమ్మం జిల్లాలో వినిపిస్తున్న మాట. అందుకే కొంత మంది ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడంతో వరంగల్ జిల్లా యూనిట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత అనుచరుడుగా ఉన్న దొడ్డా శ్రీనివాసరావు భార్య మీద కూడా.. నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం చూస్తుంటే… ఇక ఎవ్వరికీ మినహాయింపు ఉండబోదని సంకేతాలిచ్చినట్టయిందని అంటున్నారు. ఆమెను తప్పించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఒక మంత్రి దగ్గరికి ఆఘమేఘాల మీద పరుగులు పెట్టారట. కానీ…. ఇలాంటి వాటిలో నేను జోక్యం చేసుకోను, ఇక మీదట కూడా ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దని సూటిగా, సుత్తిలేకుండా చెప్పేశారట సదరు మినిస్టర్. ఆ సంగతి ఎలా ఉన్నా….సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత ప్రధాన అనుచరుడి మీద పోలీసులు కేసు పెట్టడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలే కారణమన్న వాదన బలంగా ఉంది. దీని పర్యవసానాలు ఎట్నుంచి ఎలా మారతాయో చూడాలి.
READ ALSO: OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం