సజ్జల రామకృష్ణారెడ్డి సమైక్య రాష్ట్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయ్. ఆంధ్రప్రదేశ్ పునరేకీకరణ వైసీపీ విధానమని ప్రకటించి సరికొత్త చర్చకు తెరలేపారు. మరి..సమీప భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు వస్తాయా?ఏపీ..తెలంగాణ ఒకే రాష్ట్రంగా అవతరిస్తుందా?ఉమ్మడి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
సంచలన చర్చకు తెర తీసిన సజ్జల రామకృష్ణా రెడ్డి
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎమ్ఓలో కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన చర్చకు తెర తీశారు. కుదిరితే మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏకం కావాలని వైసీపీ కోరుకుంటోందని, ముఖ్యమంత్రి జగన్ది కూడా అదే అభిప్రాయమని కుండబద్దలు కొట్టారు సజ్జల. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్పై జగన్ వైఖరిని తప్పుబట్టారు. దీంతో వైసీపీ కౌంటర్ అటాక్ గట్టిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది.
అన్యాయంగా విభజన చేసిన పాపం కాంగ్రెస్, బీజీపేలదే..!
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేసిన పాపం కాంగ్రెస్, బీజీపేలదే అని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ వచ్చిన వైసీపీ ఈసారి కొత్త అంశాన్ని లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే పరిస్థితి వస్తే ఆహ్వానించే వారిలో మొదటి వరుసలో ఉంటామన్నది వైసీపీ స్టాండ్. అంతే కాదు రెండు రాష్ట్రాలను కలిపి మళ్లీ పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయాల్సి వస్తే ముందు ఉండి పోరాడతామని కూడా సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. ఈ తేనె తుట్టెను సజ్జల ఉద్దేశపూర్వకంగానే రేపారట. తద్వారా రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేయటం ఒక అంశంమనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎందాక అయినా వెళుతుందనే మెసేజ్ను ప్రజల్లోకి పంపటం మరో టార్గెట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
విభజన సమయంలో టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం
రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎత్తుకుంటే వైసీపీ ఒక్కటే సమైక్య వాదంతో ముందుకు వెళ్లింది. అందుకే ఉమ్మడి రాష్ట్రం అంశంపై మాట్లాడే రైట్ తమకే ఉందని వైసీపి అంటోంది. ఇక్కడే ఇంకో లాజిక్ను కూడా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారట. ఇప్పుడు ఉన్నపళంగా రెండు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోతే…రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేది తమ నాయకుడే అన్నది మరో అంశం.
ఉమ్మడి ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 294
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 294. అధికారంలోకి రావాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న బలం 151 స్థానాలు. అంటే రాష్ట్రాల పునరేకీకరణ జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ, ముఖ్యమంత్రి అయ్యేది జగననేని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తానికి….వైసీపీ లెక్కలకు టీఆర్ఎస్ ఇచ్చే కౌంటర్ లెక్కలేంటో చూడాలి.