OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?

Otr

Otr

OTR: మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి…కొత్తవాళ్లు కాంగ్రెస్‌ను కబ్జా చేస్తున్నారన్న ఆగ్రహం…టైమ్ వస్తే తాను ముఖ్యమంత్రి అవుతానన్న ధీమా… ఇప్పుడు వాటన్నింటికీ కొత్తగా “రాజన్న రాజ్యం” నినాదం కూడా జోడించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.అసలు రాజగోపాల్‌రెడ్డి టార్గెట్ ఏంటి?మంత్రి పదవే కావాలా?లేక భవిష్యత్‌లో ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ఇప్పటి నుంచే చెప్పాలనుకుంటున్నారా? “తెలంగాణలో వైఎస్ రాజ్యం తెస్తా” అన్న మాట వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటలు ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్‌లో చిన్నపాటి ప్రకంపనలు సృష్టించడం లేదు.తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు.మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిని దాచుకోవడం లేదు.అదే సమయంలో నేరుగా ముఖ్యమంత్రి పేరు తీసుకోకుండా…పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోందని…అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని…పార్టీని ఎవరో కబ్జా చేయాలని చూస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ రాజకీయ స్వరానికి మరో లైన్ జోడించారు రాజగోపాల్‌రెడ్డి.”తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తాం.”అంతేకాదు…కార్యకర్తలు “సీఎం… సీఎం…” అంటూ నినాదాలు చేస్తే,“టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు” అంటూ స్పందించారు.అంటే…మంత్రి పదవి అడుగుతున్న రాజగోపాల్‌రెడ్డి…అదే సమయంలో ముఖ్యమంత్రి పదవిపైనా తన ఆశలను దాచుకోవడం లేదు.అయితే ఇక్కడే అసలు పొలిటికల్ పాయింట్ ఉంది.రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అకస్మాత్తుగా “రాజన్న రాజ్యం” నినాదాన్ని ముందుకు తెస్తున్నారు?

నిజానికి రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తి అని చాలా కాలంగా చెబుతున్నారు. నల్గొండ జిల్లాలోనూ వైఎస్‌కు ఇప్పటికీ ప్రత్యేకమైన రాజకీయ అభిమాన వర్గం ఉంది.అందుకే వైఎస్ పేరు…ఒకవైపు సంక్షేమ రాజకీయాలకు గుర్తు…మరోవైపు పాత కాంగ్రెస్ కార్యకర్తల భావోద్వేగానికి దగ్గరైన పేరు.ఇప్పుడు అదే వైఎస్ బ్రాండ్‌ను తన రాజకీయ పొజిషనింగ్‌కు రాజగోపాల్‌రెడ్డి ఉపయోగిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అంటే…“నేను కేవలం మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేను కాదు…వైఎస్ రాజకీయ వారసత్వాన్ని మోసుకెళ్లగల నాయకుడిని కూడా”అనే సంకేతాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపుతున్నారా?ఇందులో మరో లేయర్ కూడా ఉంది.ఆయన వ్యాఖ్యల్లో తరచూ వినిపిస్తున్న పదం…కొత్తవాళ్లు. కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చి…పార్టీని కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నది ఆయన స్పష్టంగా చెప్పకపోయినా,పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం వాటిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వ శైలిపై పరోక్ష విమర్శలుగానే చూస్తున్నారు. అంటే రాజగోపాల్‌రెడ్డి పొలిటికల్ లైన్ చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ – వైఎస్ కాంగ్రెస్ – పాత కార్యకర్తలు..ఈ మూడు అంశాలను కలిపి తనకంటూ ఒక ప్రత్యేక స్పేస్ తయారు చేసుకునే ప్రయత్నమా?రేవంత్‌రెడ్డి చుట్టూ ఏర్పడిన పవర్ సెంటర్‌కు ప్రత్యామ్నాయంగా…పాత కాంగ్రెస్ నేతలు, అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నమా?అన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

అయితే మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది.రాజగోపాల్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.తర్వాత మళ్లీ 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు.అందుకే “కొత్తవాళ్లు కాంగ్రెస్‌ను కబ్జా చేయకూడదు” అన్న ఆయన వ్యాఖ్యలను ప్రత్యర్థులు ప్రశ్నించే అవకాశమూ ఉంది.కానీ రాజగోపాల్‌రెడ్డి వాదన మాత్రం మరోలా ఉంది.తాను రాజకీయంగా వైఎస్ కాలం నుంచి కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నానని…తన రాజకీయ మూలాలు కాంగ్రెస్‌లోనే ఉన్నాయన్నది ఆయన చెప్పే మాట.అందుకే ఇప్పుడు “వైఎస్ శిష్యుడు” అనే ఇమేజ్‌ను మరింత బలంగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.మరి నిజంగానే రాజగోపాల్‌రెడ్డి సొంతంగా “వైఎస్ అజెండా”తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదగాలనుకుంటున్నారా? ఆయన వైఎస్ పేరు చెబుతున్నప్పటికీ…రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటున్నారు.ఇక వైఎస్ వారసత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్ రాజకీయ వారసత్వంగానే ప్రస్తావిస్తున్నారు.సో ప్రస్తుతానికి “రాజన్న రాజ్యం” అంటే కాంగ్రెస్‌కు బయట మరో రాజకీయ వేదిక అనే కంటే… కాంగ్రెస్‌లోనే తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు రాజగోపాల్‌రెడ్డి ఎంచుకున్న బ్రాండ్ అనే అర్థమే ఎక్కువగా కనిపిస్తోంది.

రాజగోపాల్‌రెడ్డి వ్యూహంలో రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయి.మొదటిది… తక్షణ లక్ష్యం – మంత్రి పదవి.హైకమాండ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ఒత్తిడి పెంచడం.రెండోది… దీర్ఘకాలిక లక్ష్యం – నాయకత్వ రేసులో తన పేరు నిలబెట్టడం.అందుకే ఒకరోజు మంత్రి పదవి…మరోరోజు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు…ఇంకోరోజు పార్టీని కబ్జా చేస్తున్న కొత్త నాయకులు…ఇప్పుడు రాజన్న రాజ్యం…దానికి తోడు “టైమ్ వస్తే సీఎం అవుతా” అన్న స్టేట్‌మెంట్. ఇవన్నీ విడివిడిగా వచ్చిన వ్యాఖ్యల్లా కనిపిస్తున్నా…ఒకదానితో ఒకటి కలిపి చూస్తే మాత్రం రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు ఒక నేరేటివ్ నిర్మించుకుంటున్నట్టు కనిపిస్తోంది. పదవి కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే నుంచి…భవిష్యత్ నాయకత్వానికి నేను కూడా ప్రత్యామ్నాయమే అనే స్థాయికి తన ఇమేజ్‌ను తీసుకెళ్లాలన్న ప్రయత్నమా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ డిస్కషన్. మరి హైకమాండ్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి అసంతృప్తిని చల్లారుస్తుందా?లేక రాజగోపాల్‌రెడ్డి ఇదే ధిక్కార స్వరాన్ని మరింత పెంచుతారా? మంత్రి పదవి దగ్గర మొదలైన అసంతృప్తి… “రాజన్న రాజ్యం” నుంచి “సీఎం రేసు” వరకు వెళ్లడం మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది.