OTR: యాందిసామీ…. దుడ్లెట్టా…! ఎవుడు పెట్టుకుంటాడు? ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమిలో ప్రస్తుతం ఈ తరహా చర్చలే తెగ జరుగుతున్నాయి. అదేంటీ… అసలు అదేం డిస్కషన్? స్థానిక సంస్థలైనా… మరో ఎన్నికైనా… నిలబడ్డ అభ్యర్థులు, వాళ్ళ పార్టీలేకదా… ఖర్చులు భరిస్తాయి. అలాంటప్పుడు ఈ మాటలేంటని అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. కూటమి అంటే సీట్లే కాదు, నోట్లు కూడా పంచుకోవాలని ప్రతిపాదిస్తున్న ఆ నాయకులు ఎవరు? ఏంటా డిఫరెంట్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఇంకా పూర్తి స్థాయిలో మోగనేలేదు. కాస్త… అలా అలా చప్పుడు వచ్చిందో లేదో…. ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమిలో వాతావరణం అప్పుడే మారిపోతోంది. ఎక్కడా లేని కొన్ని విచిత్రమైన లెక్కలు ఇక్కడ తెర మీదికి వస్తున్నాయట. సీట్ల కేటాయింపులుస సర్దుబాట్ల సంగతి తర్వాత తేల్చుకోవచ్చు.. ముందు ప్రచార ఖర్చుల మాటేంటో చెప్పండంటూ… టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలు పట్టుబడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్లారిటీ విషయంలో టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. మా పార్టీ అభ్యర్థులకే ఎన్నికల ఖర్చు పెట్టడం భారమని అనుకుంటుంటే…. ఇక పొత్తులో భాగంగా నిలబడ్డ జనసేన అభ్యర్థుల ఖర్చులు కూడా మేమే భరించాలా కొందరు ఎమ్మెల్యేలు కాస్త తేడా వాయిస్ వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.
స్థానిక సమరం సమీపిస్తున్న వేళ సీట్ల పంపకం కంటే ముందే.. ఎవరు ఖర్చు పెట్టాలి, ఎవరి అభ్యర్థికి ఎవరు అండగా నిలవాలన్న అంశంపై కొత్త పంచాయితీ తెరపైకి రావడం ఆందోళనకరమేనని అంటోంజి రెండు పార్టీల కేడర్. అదేంటి… అసలు ఒక పార్టీ ఖర్చును మరో పార్టీ నేత భరించడం ఏంటని అంటే… అసలు కిటుకు అక్కడే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఉమ్మడి జిల్లాలో జనసేన గట్టిగానే సీట్లు అడగాలని భావిస్తున్నా…అందుకు తగ్గ ఆర్థిక స్తోమత ఉన్న నాయకుల సంఖ్య తక్కువేనట. సీటు వదులుకోలేరు, అలాగని ఖర్చు పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి… ఆర్థిక అంశాల్లో కూడా మిత్ర ధర్మం గురించి మాట్లాడుతున్నారట గ్లాస్ లీడర్స్. మీరు గెలిచినా, మేం గెలిచినా అది కూటమి విజయమే కాబట్టి కనీసం సగం ఖర్చు మీరు భరించాలంటూ కొంత మంది జనసేన నేతలు టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్స్కు సందేశాలు పంపుతుండటంతో అలజడి మొదలైందని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రచార రథాలు, వాహనాలు, కార్యకర్తల బాగోగులు, రచ్చబండ సమావేశాలు, పోలింగ్ రోజు ఏర్పాట్లు.. ఇలా ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉంటుంది. మిత్రపక్షం అభ్యర్థి ఆర్ధికంగా బలహీనంగా ఉన్న చోట ఆ ఖర్చు ఎవరు భరించాలన్నదే ఇప్పుడు అసలు సమస్య అంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో… పొత్తు పంపకాలు జరిగినా… క్షేత్రస్థాయి ఖర్చుల్లో సమన్వయం ఎలా ఉంటుందన్నదే అసలు సందేహమని అంటున్నారు.
ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె, మదనపల్లె, చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లో… ఈ పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఈ విషయంలో తెలుగుదేశం స్థానిక నేతల అసంతృప్తికి కారణాలు కూడా బలంగానే ఉన్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేలుగా గెలవడానికి భారీగా ఖర్చు పెట్టామని, తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు డ్రైవ్లు, ఇతర పొలిటికల్ ప్రోగ్రామ్స్కు కూడా తమ చేతి తమురు బాగానే వదులుతోందంటున్నారు. మళ్లీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, అందునా, సొంత పార్టీ కూడా కాకుండా పక్కోళ్ళకు ఖర్చు పెట్టాల్సి రావడం బాధేకదా అని అంటున్నారట కొందరు శాసనసభ్యులు. మరోవైపు కూటమి సమన్వయంతో స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాలని రాష్ట్ర నాయకత్వం గట్టిగా పిలుపునిస్తోంది. దీంతో… ఆ పిలుపులకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదన్నది పొలిటికల్ వాయిస్. టీడీపీకి బలమైన పట్టున్న నేత సర్పంచ్ సీటు ఆశిస్తున్న చోట, అదే స్థానాన్ని జనసేన కోరితే పరిస్థితి ఏంటన్నది క్వశ్చన్ మార్క్ అవుతోంది.
అలాంటి సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ నాయకుడు మనస్ఫూర్తిగా పనిచేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇదే పరిస్థితి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ డివిజన్లలోనూ వస్తుందని అంటున్నారు. జనసేన కూడా స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామస్థాయిలో పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తోంది. అయితే… ఆ పార్టీకి సంస్థాగత పట్టు నిరూపించుకోవడం ఎంత ముఖ్యమో, అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని సమకూర్చుకోవడం కూడా అంతే కీలకంగా మారింది. పొత్తులో భాగంగా సీటు దక్కినప్పుడు అభ్యర్థి విజయం రెండు పార్టీల ఉమ్మడి బాధ్యత అని, ఒకే వర్గంపై పూర్తి భారం నెట్టేయడం సరికాదని జనసేన చేస్తున్న వాదన టీడీపీ వాళ్ళకు మింగుడుపడ్డం లేదట. ఈ దశలోనే అంతర్గత విభేదాలు రచ్చకెక్కితే అది ప్రత్యర్థి పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుస్తుందని, సీట్లు, ఖర్చుల విషయంలో అవగాహన ముఖ్యమని అంటున్నా… అది ఎలా కుదురుతుందో అంతుబట్టడం లేదని అంటున్నారు రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు. సీట్ల పంపకం అధికారికంగా ఖరారు కాకముందే తెరపైకి వచ్చిన ఈ ఖర్చుల లొల్లి.. రాబోయే రోజుల్లో కూటమి ఐక్యతకు ఎలాంటి పరీక్ష పెడుతుందోనన్న సందేహాలు పెరిగిపోతున్నాయి రాజకీయవర్గాల్లో.

