దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత ఆ టెంపుల్కు పర్ఫెక్ట్గా సరిపోతుందా? తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక కూడా ఏడాదిగా అడుగు ముందుకు పడకపోవడానికి కారణం ఏంటి? ఆ…. ఏముంది… ఆలయ పాలకమండలేగా, అంతా మంచి నీళ్ళ ప్రాయం అనుకున్న చోట కత్తి మీద సాము ఎందుకు చేయాల్సి వస్తోంది? ఏ టెంపుల్ విషయంలో అంతలా పీటముడి పడింది? ఎందుకు పడింది? యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ఏవో కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయట. ఆ విషయంలో అడుగు ముందుకు పడటంలేదు. బోర్డ్ ఏర్పాటు కోసం ఏడాది క్రితమే దేవాదాయ శాఖ చట్టానికి సవరణ చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా….. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అలా ఎందుకు జరుగుతోందని ఆరాతీసిన వాళ్ళకు…అదంతా పొలిటికల్ కంపేనని తేలుతోందట. బోర్డు చైర్మన్తో పాటు పాలక మండలిలో చోటు కోసం నాయకులు ఎవరికి వారు పైరవీలు చేసుకుంటూ ప్రభుత్వం మీద వత్తిడి తెస్తుండటంతో అసలు ప్రాసెస్ మొత్తం పక్కకు పోయినట్టు చెప్పుకుంటున్నారు. అసలు నిజాం కాలంలోనే యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి నియామకం మొదలైంది.
ఇక 1966లో రూపొందించిన దేవాదాయ చట్ట ప్రకారం ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తే….. పాలకమండలి చైర్మన్గా ఉంటున్నారు. ఆయనతో పాటు మరో 8 మంది సభ్యులు ఉండేవాళ్ళు. చివరిసారిగా 2008లో ఏర్పడిన యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. ఇక అప్పటినుండి అంటే….16 ఏళ్లుగా మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో 1250 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీని కొనసాగిస్తూ నారసింహుడి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే… టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సవరించి 18 మందితో పాలకమండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీళ్ళతో పాటు వంశపారంపర్య ధర్మకర్త, వివిధ విభాగాలకు చెందిన మఖ్య అధికారులు కూడా పాలక మండలిలో ఉంటారు. అలాగే బోర్డులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా చోటు కల్పిస్తే… యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహ స్వామి ఆలయానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు, ప్రాధాన్యత ప్రాముఖ్యత పెరుగుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే ఆధ్యాత్మిక, సేవా గుణం కలిగిన పారిశ్రామిక, వ్యాపార వేత్తలను లేదా వివిధ రంగాలలో నిష్ణాతులైన ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు కూడా మండలిలో చోటివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిర్ణయం జరిగి, అసెంబ్లీ ఆమోదించి ఏడాది గడుస్తున్నా….. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు కారణం ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక నేతలు, సీనియర్ నేతల ఒత్తిళ్లు, రాష్ట్ర స్థాయి జోక్యమేనని చెప్పుకుంటున్నారు. పాలక మండలిలో చోటు కోసం చాలా మంది అధికార పార్టీ నేతలు, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులు పోటీలు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో లేకున్నా… పార్టీ కోసం పదేళ్ళు పని చేసిన కొందరు, గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి దక్కని వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించుకునేందుకు క్షేత్రస్దాయిలో కష్టపడిన నేతలు… ఇలా ఎవరికి వారే… మాకో ఛాన్స్ అంటూ మంత్రులు, సీనియర్ లీడర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇక ఛైర్మన్ పదవి కోసమైతే….రాజకీయ నేతలతో పాటు వ్యాపార వేత్తలు, స్వచ్ఛంద సంస్థల యజమానులు, ఇతర ప్రముఖులు కూడా పోటాపోటీ ప్రయత్నాలు చేయడంతో పీటముడిపడుతోందని అంటున్నారు.
అదే సమయంలో పాలకమండలిలో తమ వారికే వీలైనన్ని ఎక్కువ పదవులు ఇప్పించుకుని అక్కడ కూడా పట్టునిలుపుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత కుందూరు జానారెడ్డిలు వ్యూహాలకు పదునుపెడుతున్నారట. ఇక ఆలయ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యే, ఎంపీలు కూడా మేమేం తక్కువ అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో… ఎలా నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాక ప్రభుత్వ పెద్దలు సైలెంట్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ కంచు కోటలో కీలక నేతల పోటీ ఒకవైపు… రాష్ట్ర స్థాయిలో పదవులు ఆశించే సీనియర్ నేతల్లో ఎవరో ఒకరిని చైర్మన్ గా నియమించాలని సీఎం మరో వైపు భావిస్తుండటంతో … బోర్డు ఏర్పాటుకు టెక్నికల్గా అడ్డంకులు లేకున్నా… పని మాత్రం జరగడం లేదని తెలుస్తోంది. ఈ కత్తిమీద సాముకు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.