ఎస్ఐఆర్లో భారీగా ఓట్లు తగ్గడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ ఓట్లు పోవడం దేనికి సంకేతం? దానికి సంబంధించి ఉన్న అంచనాలేంటి? పార్టీలు వేసుకుంటున్న లెక్కలు ఎలా ఉన్నాయి? ఎస్ఐఆర్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా ఓట్లు పోయాయి. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు, ఓట్లు షిఫ్ట్ చేసుకున్న వాళ్ళ లాంటివి ఇందులో ఉన్నాయి. ఆ రకమైనవి 46 లక్షలకు పైగానే ఉన్నట్టు తేల్చేశారు. దీంతో… ఇంత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు వల్ల రాజకీయంగా ఎవరికి నష్టం… ఎవరికి లాభం అంటూ రకరకాల చర్చలు మొదలైపోయాయి. ఈ విషయంలో అన్ని పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయట. దీనికి సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు నుంచి పార్టీ నాయకులను అలెర్ట్ చేస్తూ వచ్చారు. అంత పెద్ద మొత్తంలో ఓట్లు తొలగింపుతో ఏం జరుగుతుందన్న లెక్కతో పాటు రాజకీయంగా లాభ నష్టాలపై బేరీజు వేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇంత జరుగుతున్నా… బీజేపీ మాత్రం సైలెంట్గా ఉండటంపై కూడా గాంధీభవన్లో కాస్త అనుమానం వ్యక్తం అవుతోందట. ముఖ్యంగా హైదరాబాద్లో ఓట్ల తొలగింపుతో రాజకీయపరమైన లాభ నష్టాలపై గట్టి చర్చే జరుగుతోంది. హైదరాబాద్ విషయంలో రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆంధ్రా మూలాలున్న ఓటర్లు, తెలంగాణ ఓటర్లు … ఈ రెండు కేటగిరీల నుంచి ప్రస్తుతం డిలిట్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందికి సొంత ఊళ్ళతో పాటు ఇక్కడ కూడా ఓట్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళలో మెజార్టీ ఇప్పుడు సొంత ఊరికి ప్రాధాన్యం ఇచ్చి హైదరాబాద్ను వదులుకున్నారట.
అలాగే.. ఏపీలో, హైదరాబాద్లో రెండు చోట్ల ఉన్నవాళ్ళు కూడా కొందరు సిటీ ఓటును వదిలేసినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అంటున్నారు. జిల్లాల్లో ఓట్ల సంఖ్య పెరిగితే… రాజకీయంగా ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్న సంగతి పక్కన పెడితే… గ్రేటర్లో ఓట్లు తగ్గడం వల్ల ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందంటూ రకరకాల అంచనాలు బయటికి వస్తున్నాయి. ఆంధ్రా మూలాలున్న వారి ఓట్లు ఎక్కువ సంఖ్యలో పోతే… దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది అసలు ప్రశ్న. అందులో కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎంతమంది..? సామాజిక సమీకరణాలు కలిసి వచ్చేది ఎవరికి అనే లెక్కలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. గతంలో గ్రేటర్ ఓటర్ కాంగ్రెస్ను గందర గోళంలోకి నెట్టేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో BRSకి అండగా ఉండి.. లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు. ఇక సిటీ పరిధిలో రెండు ఉప ఎన్నికలు జరిగితే… జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కే మద్దతుగా నిలబడ్డారు. రాజస్థాన్..గుజరాత్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. వీటిలో కూడా చాలా ఓట్లు తొలగింపు కోటాలో ఉన్నాయనేది మరో ప్రచారం. ఇది ఎవరికి నష్టం చేకూరుస్తుందన్న లెక్కలు సైతం ఉన్నాయి. మూడు ప్రధాన పార్టీలకి గ్రేటర్ కీలకం. అందుకే ఓట్ల తొలగింపు ఎవరికి నష్టం చేస్తుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. అసలు ప్రక్రియ ఇప్పుడే మొదలవుతోంది కాబట్టి… నాయకుల్ని అలెర్ట్ చేయడం…అందుకు అనుగుణంగా పావులు కదిపే పనిలో అధికార పార్టీ ఉంది. ఎవరి అంచనా ఏంటి..? తొలగిన ఓట్లతో నష్టం ఎవరికి అనేది చూడాలి మరి.

