తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన కొత్త ప్రతిపాదన పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. ఆయన ఒక ఉద్దేశ్యంతో ప్రపోజల్ పెడితే… ప్రతిపక్షాలు రివర్స్లో ఆ బాణాన్ని తిరిగి సీఎం మీదికే గురిపెడుతున్నాయి. దేశమంతటా ఏం చేయాలో తర్వాత మాట్లాడుకుందాంగానీ… ముందు మీ చేతిలో ఉన్నదాన్ని చేసి చూపండని ఛాలెంజ్ విసురుతున్నాయి. ఇంతకీ రేవంత్ పెట్టిన ఆ ప్రతిపాదన ఏంటి? విపక్షాలు విసురుతున్న సవాలేంటి? రాజకీయాల్లోకి యువత రావాలి… పాలనలో కొత్త ఆలోచనలు పెరగాలని అందరూ అంటుంటారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తుంటాయి. సీనియర్ల అనుభవం, యంగ్ లీడర్ల జోష్ మధ్య ఎప్పుడూ రసవత్తరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నాయకులు ఎవరైనా… ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్ళు నిండి ఉండాలి. అయితే… ఈ అర్హత వయస్సును 21 ఏళ్ళకు తగ్గించేలా చట్ట సవరణ చేయాలని ప్రతిపాదిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో… తెలంగాణలో జెన్జీ పాలిటిక్స్ గురించి ఆసక్తికరమైన చర్చ, కాస్త పొలిటికల్ రచ్చ మొదలయ్యాయి. ఢిల్లీలో సీజేపీ ఆందోళన తర్వాత దేశ రాజకీయ రంగంలో ఓ కొత్త డిస్కషన్ మొదలైంది. పొలిటికల్ ఎంట్రీకి వయసు అడ్డుకాకూడదన్నదే దాని సారాంశం. దాన్ని కాస్త ముందుగానే అందిపుచ్చుకున్న తెలంగాణ సీఎం ఆ దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. గ్లోబల్ ట్రెండ్స్కు తగ్గట్టుగా యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఆయన లేటెస్ట్ ప్లాన్ అట. అందుకే ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 ఏళ్లు నిండి ఉండాలన్న రూల్ మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. దీన్ని 21 ఏళ్లకు తగ్గిస్తే… యువత కాలేజీల నుంచి నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుందని, ఫ్రష్ మైండ్, ఫ్రష్ థాట్స్తో రాజకీయ ప్రక్షాళన జరుగుతుందని భావిస్తున్నారాయన. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూడా తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోందట.
అలాగే ఇండియా కూటమి సమావేశాల్లో కూడా ఈ ప్రతిపాదన చేయబోతున్నట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే పొలిటికల్ మంట అంటుకుంది. దీనికి సంబంధించి తెర వెనుక రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ తీర్మానాలు, కేంద్రం ఆమోదం సంగతి తరువాత చూద్దాంగానీ….. ముందు మీ కేబినెట్లో, కీలక పదవులలో జెన్జీకి అవకాశం ఇచ్చి చూపించండి” అంటూ ప్రతిపక్షాలు రివర్స్ అటాక్ మొదలుపెట్టాయి. ముందు మీరు చేసి చూపించి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపండంటూ బీజేపీ నాయకులు గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు. సీఎం రేవంత్కు నిజంగానే జెన్జీ పాలిటిక్స్ మీద ఆసక్తి ఉంటే… యువతరానికి అవకాశాళు ఇవ్వాలనుకుంటే… కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని చేయమన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని పేర్లు కూడా బయటకి వస్తున్నాయి. ప్రస్తుతం పాలకుర్తి, మెదక్, మక్తల్ లాంటి నియోజకవర్గాల నుంచి యువ నేతలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మక్తల్ నుంచి పర్ణికారెడ్డి, పాలకుర్తిలో యశస్విని రెడ్డి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యంగ్ లీడర్స్కు అవకాశాల డిమాండ్ క్రమంలో… ఇలాంటి పేర్లు తెర మీదికి రావడంతో… రేపు కేబినెట్ విస్తరణలో ఇలాంటి వాళ్ళకు చోటు దక్కుతుందా అన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది.మొత్తానికి పోటీ అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదన రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు రేపబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

