తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విషయంలో బీజేపీ ఆశలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం సీట్లలో పోటీ చేయలేని పార్టీ ఇప్పుడు ఎలాంటి లెక్కలేసుకుంటోంది? ఏయే ప్రాంతాల్లో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆ పార్టీ లీడర్స్ నమ్ముతున్నారు? అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ బీజేపీ విస్తృత ప్రచారం చేసింది. తమకు బలం ఉంది, వాతావారణం అనుకూలంగా ఉందనుకున్న ప్రాంతాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎక్కడైతే మంచి ఫలితాలు వచ్చాయో… అవే ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఎక్కువ వార్డులను గెల్చుకుంటామని ధీమాగా ఉన్నారు కాషాయ నేతలు. ఆ లెక్కన ఉత్తర తెలంగాణ మీదే గట్టిగా ఆశలు పెట్టుకుంది బీజేపీ. పార్టీ నేతలు కూడా అక్కడే ఎక్కువగా ఫోకస్ చేశారట. మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్స్కు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డ్లు,, డివిజన్స్ అన్నీ కలిపి 2 వేల 996 వరకు ఉన్నాయి. అందులో 2 వేల 634 స్థానాల్లో పోటీలో ఉంది బీజేపీ.
వంద శాతం పోటీలో ఉంటామని ముందు చెప్పినా…చివరికి అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టలేక పోయింది కమలం పార్టీ. అయితే 48 మున్సిపాలిటీల్లో మాత్రం హండ్రెడ్ పర్సంట్ పోటీలో ఉంది. బీజేపీ ఎక్కువ చోట్ల పోటీ చేస్తోంది కూడా ఉత్తర తెలంగాణలోనే. దాంతో వోవరాల్గా అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్తో పాటు ఇటు మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఎక్కువ వార్డ్లు గెలుస్తామన్న ఆశాభావంతో ఉన్నారు కమలనాథులు. తమకున్న సానుకూల వాతావరణాన్ని బట్టి మున్సిపాల్టీలను A,B,C,Dగా డివైడ్ చేసింది బీజేపీ. ఆ ప్రకారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు టాప్ పొజిషన్లో ఉన్నాయట. గతంలో కన్నా ఈసారి ఎక్కువ మున్సిపాల్టీల్లో ఖాతా తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ లీడర్స్. గత ఎన్నికల్లో చాలా చోట్ల ఆ పార్టీకి కనీస ప్రాతినిధ్యం దక్కలేదు. ఇక ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ… మొత్తం మీద చూసుకుంటే… రెండంకెల మున్సిపాలిటీలు, నాలుగంకెల వార్డ్లు గెల్చుకుంటామని ధీమాగా ఉన్నారు పార్టీ నాయకులు. ఆ సంగతి తేలాలంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే.