Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- ధర్మవరంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిటాల శ్రీరామ్
- చివరికి మిగిలింది ఇదా అంటూ పరిటాల అనుచరుల్లో అసహనం
- ఏడేళ్ళ నుంచి ధర్మవరంలో పని చేస్తున్న శ్రీరామ్
- 2019లో సొంత నియోజకవర్గం రాప్తాడులో పోటీ, ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాక్ గ్రౌండ్ చూస్తే… చాలా పవర్ ఫుల్. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా ఆ బ్రాండ్తో జనం క్యూ కడుతారు. కానీ… సొంత కార్యక్షేత్రంలో మాత్రం తన మాటకు కనీస విలువ లేకుండా పోతోందట ఆ రాజకీయ వారసుడికి. నియోజకవర్గంలో తాను చెప్పిన పని ఏదీ జరగదు, పైగా ఎందుకు పని చేయడం లేదని టీడీపీ అధిష్టానం ఫైరింగ్. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్నట్టుగా ఉన్న ఆ నాయకుడు ఎవరు? ఎందుకా పరిస్థితి వచ్చింది? అంతా ఒక్కటే….. మనమంతా ఒక్కటే…. కలిసి ఉంటే కలదు సుఖం అంటూ…. కూటమి పెద్దలు పై స్థాయిలో ఎన్ని చెబుతున్నా….. క్షేత్ర స్థాయికి వచ్చేసరికి కొన్ని చోట్ల వ్యవహారం కాస్త తేడాగానే కనిపిస్తోంది. పోనీ, ఎవరో ఒకరు రాజీపడి పనిచేద్దామన్నా… చాలా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉండటం లేదట. ఎవరి డామినేషన్ ఉంటే వాళ్ళు పైచేయి కోసం ప్రయత్నిస్తూ… అవతలి వాళ్ళను తొక్కేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. ఈ లిస్ట్లో చేరిన మరో నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున గెలిచిన సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Also Read
అటు టీడీపీ ఇన్ఛార్జ్గా పరిటాల శ్రీరామ్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పరిటాల వర్గంలో ఇప్పుడు తీవ్ర అసహనం పెరుగుతోందట. పార్టీ కోసం భుజాలు అరిగేలా, వెనుక ఖజానా తరిగేలా పని చేసినా… చివరికి ఒరిగిందేమీ లేదన్న అసంతృప్తి పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే తరహా వాతావరణం ఉన్న మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే…. ధర్మవరంలో పరిటాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్న చర్చలు నడుస్తున్నాయి. అధిష్టానం చెప్పిందన్న ఏకైక కారణంతో…. శ్రీరామ్ తమ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి ఏడేళ్లుగా ధర్మవరంలో పనిచేస్తుంటే… ఇప్పటి వరకు పార్టీ చేసిందేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, ఎమ్మెల్యే పరిటాల సునీత వారసుడిగా పొలిటికల్ అరంగేట్రం చేసిన శ్రీరామ్…. 2019లో సొంత నియోజకవర్గం రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక రాప్తాడులో తానేంటో నిరూపించు కోవాలనుకున్న సమయంలో టీడీపీ అధిష్టానం ఆయన్ని ధర్మవరం పంపింది. అటు రాప్తాడులో పరిటాల సునీత ఇన్ఛార్జ్గా కొనసాగారు. తీరా 2024 ఎన్నికల సమయానికి కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీ కోటాలోకి వెళ్ళింది ధర్మవరం. సత్యకుమార్ను రంగంలోకి దించింది ఆ పార్టీ. దీన్ని క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించినా….. కూటమి ధర్మం ప్రకారం శ్రీరామ్ పనిచేశారని, అయినా సరే కనీస గుర్తింపు లేకుండా పోయిందన్నది ఆయన అనుచరుల ఆనేదన. అటు ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి ధర్మవరం బీజేపీ హోల్డ్లోకి వెళ్లిపోయింది. స్థానికంగా ఉన్న కొంతమంది వైసీపీ నేతలు సైతం కాషాయ కండువాలు కప్పుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీ టార్గెట్గా పని చేయాల్సిన నాయకులు కొందరు మిత్రపక్షం టీడీపీ లక్ష్యంగా పని చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నాయకులకు పని జరగకుండా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో… శ్రీరామ్ అధిష్టానం దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల్ని ఏకరువు పెట్టారట. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు లేకపోగా…గతంలో టీడీపీ నాయకుల్ని ఇబ్బందిపెట్టిన వారిని బీజేపీలోకి చేర్చుకోవడంతో పుండు మీద కారం చల్లినట్టు ఫీలవుతున్నారట. కానీ… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నియోజకవర్గం కోసం బీజేపీతో విబేధాలు తెచ్చుకోవాలని టీడీపీ అధిష్టానం భావించడం లేదు. దీన్ని గమనించిన పరిటాల శ్రీరామ్ ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల ఇబ్బందులకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. ఇందులో సగానికి పైగా తేలిగ్గా పరిష్కరిందగ్గవే అయినా…. అధికారులు మాత్రం బీజేపీ నేతలు చెబితేనే అంటున్నారట. దీంతో… రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ కూడా ఇక మా మాటకు విలువేముందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ సంకటాలన్నీ ఇలా ఉంటే… ఆ మధ్య పరిటాలకు టీడీపీ అధిష్టానం నుంచి నోటీసు వచ్చింది.నియోజకవర్గంలో ఎందుకు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడంలేదో వివరణ ఇవ్వమన్నది దాని సారాంశం. అందుకు శ్రీరామ్ కూడా గట్టి సమాధానమే ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజలు, కార్యకర్తలు సమస్యలు చెప్పుకుంటే వాటిలో కొన్నైనా పరిష్కరించాలి.. ఇప్పటి వరకు ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు…. ఇంతకంటే ఇంకేం చేయాలని రిప్లయ్ ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో ఆర్డీవో, డీఎస్పీ ఆఫీస్లచుట్టూ శ్రీరామ్ స్వయంగా తిరిగితే తప్ప పనులు కావడం లేదట. పైగా బీజేపీ నేతల వద్దకు వెళ్తే త్వరగా పని అవుతుందన్న భావన స్థానికంగా పెరిగిపోతుండటం పరిటాలకు ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. దీంతో ఇప్పుడాయన పొలిటికల్గా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఇటు టీడీపీ అధిష్టానాన్ని ధిక్కరించలేరు.. అలాగని బీజేపీ మీద రివర్స్ అటాక్ చేయలేరు. ఎటూకాని సంకట స్థితిలో ఉన్నారట పరిటాల వారసుడు.
- Tags
- ntv
- OTR
- Paritala Sreeram
తాజావార్తలు
-
Sukhbir Singh Badal: నాందేడ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!