తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు ఖరారైందా? ముహూర్తం విషయంలో కూడా దాదాపు క్లారీటీ వచ్చేసిందా? పెద్దగా టైం తీసుకోకుండా…. పార్టీ ప్రకటన తర్వాత వెంటనే ఎన్నికల యుద్దంలోకి దిగేందుకు కూడా ప్లాన్స్ సిద్ధమవుతున్నాయా? పార్టీ ఇంకా పుట్టకముందే ఏ యుద్ధం కోసం సిద్ధమవుతోంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెడుతున్నారన్న మాటలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా… ఇప్పటిదాకా ఎక్కడా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన తెలంగాణ జాగృతి తరపునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారామె. జిల్లా యాత్రలు కూడా అదే బ్యానర్ కింద చేశారు. ఇక పార్టీ కోసం రెండు నెలల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న కవిత… దానికి సంబంధించిన చిన్న చిన్న కారణాలతో హైకోర్ట్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇక కొత్త పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో పేరు కూడా ఫైనల్ అవకముందే… ఎన్నికల్లో పోటీ గురించిన చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాజాగృతి తరపున అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు ఆల్రెడీ కసరత్తు మొదలైపోయిందట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ గుర్తుతో తెలంగాణ జాగృతి నాయకులు పోటీ చేశారు. సీట్లు గెలవకపోయినా చాలా చోట్ల జాగృతి అభ్యర్థులు గెలుపు ఓటములను ప్రభావితం చేశారన్న లెక్కలున్నాయి. ఇప్పుడిక పార్టీ ఫైనల్ అయింది. పేరు కూడా దాదాపు అదే ఉండవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చలు జరుగుతున్నాయి.
పార్టీ పెట్టక ముందే మున్సిపల్ ఎన్నికల రూపంలో జనాల్లోకి వెళ్ళడం, గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయగలిగిన కవిత… ఇక ప్రకటన తర్వాత దూకుడు పెంచవచ్చని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కవిత పార్టీ పెట్టిన వెంటనే జరగబోయే తొలి ఎన్నికలు అవి. అందుకే తెలంగాణ ప్రజా జాగృతి తరపున కచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్ని నిలబెడతారన్న అంచనాలున్నాయి. ఈ మధ్య ఒక చిట్ చాట్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు కవిత. ఇప్పటి నుంచే తమ అనుచరులు ఎన్నికల్లో పోటీ గురించి తనతో చర్చిస్తున్నారని అన్నారామె. పార్టీ ఏర్పాటు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అన్నారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా… ఎన్నికల రంగంలోకి దిగితేనే అప్పుడే పెట్టిన పార్టీకి తప్పు ఒప్పులు తెలుస్తాయన్నది జాగృతి నేతల భావనగా తెలుస్తోంది.
అలాగే…. యువత, మహిళలకు పార్టీలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారి కంటే కొత్తగా వచ్చేవారికి తమ పార్టీలో ప్రయారిటీ ఇస్తామని పదేపదే చెబుతున్నారు కవిత. ఇదే సమయంలో… కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఇప్పుడే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేయలేరు కాబట్టి వారికి ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలే కరెక్ట్ అన్న లెక్కలు సైతం ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్ట్ తనను నిర్దోషిగా ప్రకటించడం లాంటి అంశాలు కలిసి వస్తున్నాయని చెప్తున్న కవిత… రేపు ఎన్నికల్లో అది ప్లస్ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారట. అయితే…ఇప్పటికే త్రిముఖ పోటీ ఉన్న రాష్ట్రంలో కొత్తగా వచ్చే పార్టీ ఎవరి ఓట్ బ్యాంక్కు గండి కొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉన్న మూడు పార్టీలను కాదని ఆమె తనకు స్థిరమైన ఓట్ బ్యాంక్ను ఎలా సృష్టించుకుంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. అదే సమయంలో బీఆర్ఎస్ మీద పడే ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.