దానం నాగేందర్ ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఆయనకు క్లారిటీ లేదా…? లేక కావాలనే అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా…? ఆయన అనర్హత పిటిషన్ విచారణలో కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటి? ఆ విషయమై బీఆర్ఎస్కు, బీజేపీకి ఉన్న తేడా ఏంటి? బీజేపీ ఉచ్చు ఎమ్మెల్యే మెడకు బిగుసుకుంటుందా? లెట్స్ వాచ్. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ మలుపులు తిరుగుతోంది. దీనికి సంబంధించి BRS వేసిన పిటిషన్ విచారణ ముగిసింది. అయితే… బీజేపీ పిటిషన్ విషయంలో కొన్ని పేచీలు తెర మీదకు వచ్చాయి.
దానం పార్టీ మారాడని చెప్పడానికి.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీ చేసిన దానికంటే పెద్ద ఎవిడెన్స్ ఏముంటుందని వాదిస్తూ వచ్చింది బీఆర్ఎస్. అయితే… సరిగ్గా అక్కడే ఓ మెలిక వేసి పెట్టారు ఎమ్మెల్యే. ఫిర్యాదు చేసే నాటికి నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒకసారి ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవద్దంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను కోరారాయన. అక్కడే కొత్త పేచీ వచ్చి పడింది. అటు బీజేపీ కూడా అనర్హత పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యింది.
అయితే…. బీజేపీ ఫిర్యాదు చేసే నాటికి దానం కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉన్నారు. దాంతో… ఎట్నుంచి ఎటు చూసుకున్నా… మేం వేసిన పిటిషన్కే ఎక్కువ విలువ ఉందని, విచారణ అర్హత ఉందని వాదిస్తోంది కాషాయ దళం. దానం అఫిడవిట్ ఇవ్వడానికి అంత సుముఖంగా లేరంటూ మొదట్లో… Brs, బీజేపీ అడ్వకేట్స్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వాదనలు వినిపించడానికి ఆయన ముందుకు వచ్చారు. మూడు రోజుల క్రితమే విచారణ ముగియాల్సి ఉన్నా.. బీజేపీ అడ్వకేట్స్ సరికొత్త ట్విస్ట్ను తెర మీదికి తీసుకువచ్చి విచారణార్హత గురించి ప్రస్తావించడంతో దానం తరపు అడ్వకేట్స్ కూడా గడువుకోరి శనివారంనాడు తమ వాదన వినిపించారు. దానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే… మొదట నేను పార్టీ మారలేదని, తర్వాత.. నేను అందరిలాగా కాదు… కాంగ్రెస్లో చేరానని మీడియా ముందు ప్రకటించి దానం నాగేందర్ ఎందుకు ఇలా ఆగమాగం అవుతున్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. రోజుకో అంశాన్ని మెన్షన్ చేయడంతో అసలు దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.