వాళ్ళిద్దర్నీ ఓకే చేస్తారా? లేక బ్రేకేస్తారా…? ఆ మంత్రికి మరో వారం రోజుల్లో పదవీ గండం పొంచి ఉందా…? లేక ఊరట దక్కుతుందా? ఉత్కంఠ మీద ముందే క్లారిటీ వస్తుందా? లేక లాస్ట్ మినిట్ దాకా నరాలు తెగాల్సిందేనా? పదవి మీద కత్తి వేలాడుతున్న ఆ తెలంగాణ మంత్రి ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఏప్రిల్ 31… ప్రస్తుతానికి తెలంగాణ పాలిటిక్స్లో ఈ డేట్కో ప్రత్యేకత ఉంది. రాష్ట్ర కేబినెట్లో ఉన్న ఓ మంత్రికి ఇది చాలా ముఖ్యం. ఆయన పదవి ఉంటుందా..? ఊడుతుందా అన్నది ఆ రోజున తేలిపోతుంది. అయితే… అంతకంటే ముందు కేబినెట్ మీటింగ్లో అజారుద్దీన్ పదవి విషయంలో పెరుగుతున్న సస్పెన్స్కు తెర దించుతారా అన్న చర్చలు సైతం ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు జులై 22 కి వాయిదా వేసినందున అదేమైనా అడ్డంకిగా మారుతుందా అన్న డౌట్స్ సైతం పెరుగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్నారు సీఎం రేవంత్. అప్పటికి ఆయన చట్టసభ సభ్యుడు కానందున రూల్స్ ప్రకారం ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంది. ఈనెల 31తో ఆ.. ఆరు నెలల గడువు ముగిస్తుండగా… అజార్ ఇంతవరకు ఏ సభకూ ఎన్నికవలేదు. దీంతో… నెలాఖరులోపు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? అజహర్ పదవి ఉంటుందా? ఊడుతుందా..? లాంటి ప్రశ్నల చుట్టూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేదా అన్న విషయంలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. అజహర్తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ను కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ గతంలోనే తీర్మానం చేసింది రాష్ట్ర మంత్రివర్గం. దాన్ని గవర్నర్కి పంపింది. కానీ… విషయం తేలకుండా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. అటు సుప్రీం కోర్ట్లో కేసు కూడా కొనసాగుతున్నందున ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల గవర్నర్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటా MLC ల నియామకానికి అప్రూవల్ ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. సుప్రీంకోర్టు కూడా గవర్నర్ను అప్రోచ్ అవ్వండి, నిబంధనల మేరకు నడుచుకోండని చెప్పిందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.ఈ పరిస్థితుల్లో గురువారం మరోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. ఆ సందర్భంగానే… అజారుద్దీన్… ప్రొఫెసర్ కోదండరాం పేర్లను మరోసారి ప్రతిపాదించబోతోంది. గడువు దగ్గర పడ్డందున మంత్రిగా అజారుద్దీన్ కి రిలాక్స్ వస్తుందా..? లేదంటే ఏం జరగబోతోందన్న సస్పెన్స్ పెరుగుతోంది. ఇక మిగిలింది వారం రోజులే. ఇంతలో ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ వస్తుందా..? లేదా అన్నది తేలాల్సి ఉంది. లోక్భవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.
