వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టిందా? అందుకోసం గ్రౌండ్ లెవల్ నుంచి నరుక్కు రావాలని భావిస్తోందా? దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారా? ఎలా ఉంది గులాబీ దళం ప్లానింగ్? అధిష్టానం ఏం చేయబోతోంది? రజతోత్సవ వేడుకల్ని ఏడాదిగా జరుపుకుంటోంది బీఆర్ఎస్. ఈనెల 27న ముగింపు వేడుకలు నిర్వహించబోతోంది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారు. ఆరోజున చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. గతంలో టీఆర్ఎస్…బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. 2022లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వెంటనే వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. తర్వాత పార్లమెంటు ఎన్నికలు కూడా రావడంతో కమిటీల విషయంలో ముందడుగు పడలేదు. ఈ క్రమంలో… నిరుడు రజతోత్సవ బహిరంగ సభ వేదిక పైనుంచి ప్రకటన చేశారు కేసీఆర్. ఈసారి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకుందామంటూ పిలుపునిచ్చారాయన.
కానీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు , మున్సిపల్ ఎన్నికలు వరుసగా రావడంతో కమిటీలు ఏర్పాటు వాయిదా పడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో ఏ ఎన్నికలకు సంబంధించిన హడావుడి లేదు. దీంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారట పెద్దలు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండడంతో.. ఆ లోపు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఖచ్చితంగా కమిటీల్ని నియమించాలన్న ప్లానింగ్ లో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. ప్రస్తుతం పార్టీకి కేవలం జిల్లా అధ్యక్షులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కొంతమంది ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్త కమిటీల నియామకం అనివార్యమైంది. గ్రామస్థాయి నుంచి నియమించాలనుకుంటున్నా సాధ్యాసాధ్యాలపై కొన్ని అనుమానాలున్నాయి. గ్రామ పార్టీ కమిటీలు వేయాలంటే ఖచ్చితంగా సభ్యత్వాల నమోదు తర్వాతనే అంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే ప్రస్తుతం సభ్యత్వంతో సంబంధం లేకుండా ఉండే మండల కమిటీల నుంచి మొదలుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ఎన్నికల మూడ్ మొదలు అవుతుంది. అందుకే ప్రతిపక్ష పార్టీగా కమిటీల్ని పూర్తి చేసి దూకుడు పెంటాలని భావిస్తున్నట్టు సమాచారం.
