ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కుదుపుల మీద కుదుపులు పెరిగిపోతున్నాయా? మనం మరీ… అంత పనికిమాలిన తరహాలో ఉన్నామా? ఓ మాదిరిగా కూడా చేయలేకపోతున్నామా? వాళ్ళు చెబుతున్నది నిజమేనా అంటూ… మినిస్టర్స్లో తీవ్ర అంతర్మథనం పెరిగిపోతోందా? ఏ విషయంలో మంత్రులు అంతలా ఫీలైపోతున్నారు? ఏకంగా కేబినెట్ కేబినెట్ గుసగుసలాడేసుకుంటున్న ఆ అంశం ఏది? అవునా… నిజమా…. పబ్లిసిటీలో మనం మరీ అంత వెనకబడిపోయా? నిజంగానే చేసింది చెప్పుకోలేక పోతున్నామా? మనం సరిగా చెప్పలేకపోతున్నామా? లేక అది జనానికి సక్రమంగా అర్ధం కావడం లేదా? ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య ప్రస్తుతం ఇలాంటి రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ….సరికొత్త చర్చ మొదలైందట. ఇదే విషయం మీద సీఎం చంద్రబాబు పదేపదే చురకలంటించడం, క్లాస్లు పీకడంతో… మంత్రుల్లో ఒక రకమైన అపరాధ భావం పెరుగుతోందట. నిజంగానే ప్రభుత్వ పరంగా అన్నీ సక్రమంగా జరిగిపోయి… మనకు మాత్రమే చెప్పుకోవడానికి చేతకావడం లేదా అని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.
మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ కూడా….సహచర మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వైసీపీకి దీటైన కౌంటర్స్ ఇవ్వడంలోగాని, చేసింది చెప్పుకోవడంలోగానీ… మంత్రుల తీరు సరిగా లేదని లోకేష్ అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు మంత్రులు కూడా పబ్లిసిటీ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా… జనంలో ఎందుకు రిజిస్టర్ అవలేకపోతున్నాయన్న అంతర్మథనం ఏపీ మంత్రుల్లో మొదలైందన్నది ఇంటర్నల్ టాక్. ప్రభుత్వం ప్రారంభించే ఏ కార్యక్రమం గురించి అయినా… మంత్రులు అమరావతిలో మాట్లాడేసి ఇక మా డ్యూటీ పూర్తయిపోయిందని అనుకుంటున్నారని, జిల్లాల్లో మాట్లాడ్డం లేదన్న అభిప్రాయం ఉంది.
అటు లోకేష్ కూడా ఇదే విషయాన్ని మంత్రులతో చెప్పారట. చంద్రబాబు కూడా సైతం ఇదే విషయంలో సీరియస్ అవడంతో…..ఇప్పుడేం చేయాలని మంత్రులు మధనపడుతున్నట్టు తెలుస్తోంది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని బయటికి బాకా కొడుతున్నా… వాస్తవానికి అందులోని నాలుగు పథకాలే కచ్చితంగా అమలవుతున్నాయన్నది ఎక్కువ మంది ఏపీ మంత్రుల అభిప్రాయమట. ఒకవైపు నాలుగు స్కీమ్స్ని మాత్రమే పక్కాగా అమలు చేస్తూ…మరోవైపు సూపర్ సిక్స్. సూపర్ హిట్ అని చెప్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కేబినెట్ సహచరుల మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
అలాగే మెడికల్ కాలేజీల నిర్మాణానికి పీపీపీ విధానం, నకిలీ మద్యం వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఇరుకున పడిందని, వీటి విషయంలో వైసీపీదే అప్పర్ హ్యాండ్ అయిందని ప్రైవేట్ టాక్స్లో మాట్లాడుకుంటున్నారట మంత్రులు. అందుకే మనం ఎంత చెప్పినా జనంలోకి ఎక్కడం లేదన్నది వాళ్ళలో మెజార్టీ ఫీలింగ్గా తెలుస్తోంది. అయినాసరే… మనం తగ్గకూడదని, ఇంకా గట్టిగా వాయిస్ రెయిజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇది ఇప్పుడేగనుక సెట్ అవకుంటే…. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని మంత్రులు భావిస్తున్నారు. అలాగే… మంత్రులు కూడా అన్ని విషయాల మీద వ్యక్తిగత అవగాహన పెంచుకోవాలని, కేవలం కన్సల్టెంట్స్ చెప్పే మాటల్నే నమ్ముకుంటే… ఇబ్బందులు తప్ప మైలేజ్ రాదని ఓ సీనియర్ మినిస్టర్ అన్నట్టు తెలిసింది. దీంతో… తక్కువ టైంలో ఎక్కువ ప్రచారం పొందడం ఎలాగన్న క్రాష్ కోర్స్ల కోసం వెదుకుతున్నారట ఏపీ మంత్రులు.