OTR: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా?

Otr

Otr

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా? కలిసి కట్టుగా ఉండాల్సిన సందర్భాల్లో సైతం ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారా? అసలు ఒకే సబ్జెక్ట్‌ మీద ఒకేలా అభిప్రాయంతో ఉండకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ గందరగోళాన్ని పెంచుతున్నారా? శాసనసభ్యుల వైఖరితో పార్టీ స్టాండ్‌ ఏంటో అర్ధంకాని పరిస్థితులు తలెత్తుతున్నాయా? అసలు ఏయే విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు కాషాయ ప్రజాప్రతినిధులు?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. 22A భూముల విషయమై చర్చకు సభలోపట్టు పట్టడం, నిరసన వ్యక్తం చేయడం లాంటి అంశాల్లో పార్టీకి మంచి మార్కులు పడ్డాయన్న అభిప్రాయం ఉంది. కానీ… అదే సమయంలో మరికొన్ని వ్యవహారాలకు సంబంధించి విమర్శలు వస్తున్నాయి. అసలు కమలం ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేస్తున్నారా? పార్టీ లైన్‌లో నడుస్తున్నారా? లేదా? అన్న సందేహాలు వివిధ వర్గాల్లో పెరిగిపోతున్నాయట. అసెంబ్లీ సెంట్రల్‌ హాల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా… సీఎంతో కలిసి బీజేపీ సభ్యులు బ్రేక్ ఫాస్ట్ చేయడంపై కాస్త డిఫరెంట్‌గానే చర్చలు జరిగాయి. ఆ విషయమై సొంత పార్టీ వర్గాల నుంచే ఎమ్మెల్యేలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదైనా అనుకుంటే అలాంటి కార్యక్రమాలకు అంతా కలిసి వెళ్ళాలి, లేదా కలిసే డుమ్మా కొట్టాలిగానీ… ఇద్దరు ముగ్గురు మాత్రమే వెళ్లి అధికార పార్టీ నేతలతో టేబుల్‌ పంచుకోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఇక మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను పొగుడుతూ మాట్లాడుతున్నారట. దాంతో…. ఇదేందయ్యా… ఇది, చానా కొత్తగా ఉందే అంటూ… కాషాయ లీడర్స్‌ ఆశ్చర్యపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక… అసెంబ్లీ సమావేశాల మొదటి మూడు రోజులు తమ డిమాండ్స్‌ను, వాయిదా తీర్మానాలను పరిగణనలోకి తీసుకోనందుకు వాకౌట్‌ చేశారు బీజేపీ సభ్యులు. నాలుగో రోజున సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భేటీ అయ్యారు. వెళ్ళాలా వద్దా అన్న దానికి సంబంధించి తర్జన భర్జన పడ్డారు. ఆ సందర్భంగా గట్టి వాదోపవాదాలు కూడా జరిగాయట. పార్టీ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలే అందుకు కారణమని అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా మాట్లాడారట. అయినా… ఒక నిర్ణయానికి రాలేకపోయారని చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వం సభలో మైక్ ఇవ్వకుండా…. కేంద్రాన్ని టార్గెట్ చేస్తోందని, రాష్ట్రంలోని సమస్యలను లేవనెత్తినా పట్టించుకోవడం లేదని అందుకే… సభలో ఉండడంకన్నా… బయటికి వెళ్ళడం బెటరని కొందరు పెద్దలు సూచించారట. ఉత్తుత్తినే రాకుండా… నిరసనను బలంగా తెలియజేసి బయటికి రమ్మన్న సూచనలను కొందరు సభ్యులు పెడ చెవిన పెట్టినట్టు తెలిసింది. అలాగే… సభలో మాట్లాడినప్పుడు కూడా… ఒకే సబ్జెక్ట్‌ మీద ఎవరికి వారు వేర్వేరుగా తమ ఇష్టానుసారం అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో… వాటిపై అసలు బీజేపీ స్టాండ్‌ ఏంటో అర్ధంకాకుండా పోయిందన్న వాదన సైతం ఉంది. ఉదాహరణకు… డేటా సెంటర్స్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఒకరు మాట్లాడితే, అవి కావాల్సిందేనని
మరొకరు మాట్లాడారట.

పంటల భీమా పధకాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో BJLP డిప్యూటీ లీడర్ పాయల్ శంకర్ అసెంబ్లీ వరకు ట్రాక్టర్ మీద వచ్చారు. కానీ… ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు అందరూ పాల్గొనలేదు. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయని, ఎవరికి వారు సొంత అజెండా, ఇగోలను పక్కన పెట్టి అందరూ కలిసి నడవకుంటే కష్టమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయవర్గాల్లో. పార్టీ కేడర్‌ కూడా…. ఇది మంచి పద్ధతి కాదన్న అభిప్రాయంతో ఉందట.