ఆ వైసీపీ మాజీ ఎంపీ లెక్కలు మారిపోయాయా? జిల్లాలో ఎక్కడ వేలు పెట్టాలో అర్ధంకాక వోవర్ టు విజయవాడ అనేశారా? తాడేపల్లి కేంద్రంగా వాయిస్ వినిపిస్తూ… పెద్దల దృష్టిలో పడితే…ఛాన్స్ దొరకడంతో పాటు మరకల్ని కూడా కడిగేసుకోవచ్చని భావిస్తున్నారా? ఎవరా ఎంపీ? ఏ జిల్లాలో స్పేస్ కోసం చూస్తున్నారు? ఆయన మీద పడ్డ మరకలేంటి? ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకుల జీవితాల్ని కీలక మలుపు తిప్పాయి 2019 ఎన్నికలు. కొంతమందికి బాగా కలిసి వస్తే… మరి కొందరికి మాత్రం ఒక చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ముందు, వెనక ఆలోచించకుండా, ఏ మాత్రం విచక్షణ లేకుండా అప్పట్లో కొంతమంది నాయకులు చేసిన తప్పులు నేటికీ వాళ్ళని వెంటాడుతున్నాయి. అలాంటి వాళ్ళలో ఒకరు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఒకప్పుడు సీఐగా ఉన్న మాధవ్ 2019 ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అదే ఎన్నికల్లో హిందూపురం లోక్సభ సీటు నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు. అంత తక్కువ టైంలో ఒక నాయకుడు, అందునా రాజకీయాలతో అస్సలు టచ్ లేని వ్యక్తి వచ్చి ఎంపీగా గెలవడం అన్నది నిజంగానే రికార్డ్. ఆ ఎన్నికల్లో ఎంత వైసీపీ వేవ్ ఉన్నా… నాన్ పొలిటికల్ పర్సన్ ఏకంగా ఎంపీ అవడం అన్నది అంత ఈజీ కాదు.
నాడు మాధవ్కు జగన్ ఛరిష్మాతో పాటు కుల బలం కూgడా బాగా కలిసి వచ్చి పార్లమెంట్ మెట్టు ఎక్కారన్న విశ్లేషణలున్నాయి. అయితే… ఆ స్థాయి విజయం సాధించిన నాయకుడు ఎలా ఉండాలి? తన పరపతిని పెంచుకుంటూ ఎంతలా నిలబెట్టుకోవాలి? గోరంట్ల మాధవ్ ఏ మాత్రం నిలబెట్టుకోలేక మొత్తం పోగొట్టుకున్నారన్న అభిప్రాయం పొలిటికల్ పండిట్స్ది. సీఐగా ఉన్నప్పుడు ఆయన చూపించిన దూకుడు రాష్ట్రంలో చర్చనీయాంశం. ఎంపీ అయ్యాక కూడా ఆ పోస్ట్కు తగ్గ పరిణితి ప్రదర్శించకుండా… పాత మూస ధోరణితోనే ముందుకెళ్లారన్న అభిప్రాయాలున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట వివాదాలతో వార్తల్లో ఉండేవారాయన. వాటన్నిటికీ మించి ఒక వీడియో బయటికి వచ్చి ఏకంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రచ్చ అయింది. ఇంకా చెప్పాలంటే ఎంపీ తలెత్తుకోలేని పరిస్థితులు వచ్చాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
ఆ దెబ్బకే… 2024 ఎన్నికల్లో ఆయనకు తిరిగి టిక్కెట్ దక్కలేదని కూడా చెప్పుకుంటారు. తనకు టికెట్ రాకపోయినా వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు మాధవ్. ఇక 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత చాలామంది నాయకులు డీలా పడిపోతే గోరంట్ల మాధవ్ మాత్రం యాక్టివ్ గా కనిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే విమర్శల దాడి మొదలుపెట్టారాయన. తాను కోల్పోయినదాన్ని తిరిగి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు మాధవ్. అందుకే జిల్లా పార్టీలో యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేశారు. హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన శాంతమ్మ…ప్రస్తుతం అడ్రస్ లేరు. ఆ స్థానం ఖాళీగానే ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం మాధవ్కు అప్పజెప్పలేదు. ఆయన కూడా ఏదో ఒక అసెంబ్లీ సీటు చూసుకుంటే బెటరన్న అభిప్రాయంతో ఉన్నారట. కానీ… జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా ఆ స్పేస్ కనిపించడం లేదు. అలాగని మాధవ్ పోటీ చేయకుండా ఉండలేరు. ఈ క్రమంలో 2029 ఎన్నికలకల్లా… తాను యాక్టివ్గా ఉన్నానని చెప్పాలంటే…. ఇప్పటినుంచే ఒక బలమైన ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. కానీ…. జిల్లాలో నాయకుల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ప్రస్తుతానికి ఓనర్ టు అమరావతి అన్నారు. విజయవాడ కేంద్రంగా ఇటీవల తన వాయిస్ వినిపిస్తున్నారాయన. అలా అధిష్టానం దృష్టిలో కూడా పడితే… రేపటి రోజున జిల్లాలో సైతం ఇబ్బందులు ఉండవని లెక్కలేసుకుంటున్నారు ఎక్స్ ఎంపీ.
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ చేబ్రోలు మీద దాడికి ప్రయత్నించిన కేసులో జైలుకు వెళ్ళి వచ్చాక అనంతపురం జిల్లాలో పెద్దగా కనిపించడం లేదు మాధవ్. ఏదైనా ఇష్యూ జరిగితే తప్ప ఆయన ఇక్కడికి రావడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ వ్యవహారానికి సంబంధించి అయినాసరే…. విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచే తన వాయిస్ వినిపిస్తున్నారాయన. విజయవాడలో మాట్లాడితే ఎక్కువగా ఫోకస్ ఉంటుందన్న కేలిక్యులేషన్స్ కూడా ఉన్నాయట. అందుకే అక్కడి నుంచే తన రాజకీయాలు ప్రారంభించినట్టు చెప్పుకుంటున్నారు జిల్లాలో. అక్కడే ఉంటే పార్టీ అధినేత జగన్ దృష్టిలో పడటం కూడా తేలిక అనుకుంటున్నట్టు తెలిసింది. ఆ విధంగా అనంతపురం జిల్లాకు దూరంగా ఉన్నా.. అధిష్టానానికి దగ్గరగా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఇలాగే కొన్ని రోజులు కొనసాగుతూ… అధిష్టానం దృష్టిలో పడితే….. తన సొంత జిల్లా కర్నూలు అయినా లేక స్థిరనివాసం ఏర్పరచుకున్న అనంతపురం జిల్లాలో అయిన ఎక్కడో చోట ఒక ఛాన్స్ ఇవ్వకపోతారా అన్నది ఆయన ఆశగా చెప్పుకుంటున్నారు. అది ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.