ముగ్గురు సీఎంలను తీసుకొచ్చి ఖమ్మం సభ సక్సెస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి వ్యూహం ఏంటి? పొరుగున ఉన్న ఏపీనే BRS టార్గెట్టా? విశాఖలో KCR సభ ప్రకటించడానికి ప్రత్యేక కారణం ఉందా?
ఏపీలోనూ ఖమ్మం బీఆర్ఎస్ సభ ప్రభావం..!
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి బహిరంగసభను ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలోనే. మొదట ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ఈ సభను ఖమ్మానికి మార్చుకుంది. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంల సమక్షంలో ఇక్కడే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముగ్గురు సీఎంలతోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, CPI ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా ఈ సమావేశానికి హాజరుకావడంతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ దృష్టిని ఆకర్షించింది. బిజెపి, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా తామంతా ఒకటే అనే సంకేతం ఇచ్చింది అధికారపార్టీ.
విశాఖలో తదుపరి బీఆర్ఎస్ బహిరంగ సభ..!
ఖమ్మం తర్వాత నెక్ట్స్ బహిరంగసభ ఆంధ్రప్రదేశ్లోనే అని బీఆర్ఎస్ ప్రకటించింది. అదీకూడా ప్రతిపాదిత ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖలో సీఎం కేసీఆర్ సభ ఉంటుందని చెబుతోంది. త్వరలోనే సభ తేదీని ఫైనల్ చేయనుంది. బయటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఏపీ మినహా ఎక్కడా రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించలేదు. ఏపీకి అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు రిటైర్డ్ సివిల్ సర్వెంట్లను బీఆర్ఎస్లో చేర్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ నిర్వహించబోయే సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
విశాఖ సభకు ఎవరెవరిని ఆహ్వానిస్తారు?
విశాఖలో బీఆర్ఎస్ సభకు సీఎం కేసీఆర్ ఎవరెవరిని ఆహ్వానిస్తారనేది ఉత్కంఠగా మారింది. 175 సీట్లలో పోటీ చేస్తామని చెబుతున్న ఆ పార్టీ.. ఏపీలో వేయబోతున్న అడుగులను అన్ని పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఏపీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలైన వైసీపీ, టిడిపి, బిజెపి, జనసేనతో సంబంధం లేకుండా కేసీఆర్ సభను నిర్వహించబోతున్నారు. అలాగే ఏపీలో మూడు రాజధానులపై గులాబీ బాస్ ఏం చెబుతారు? ఏపీలోని అధికార వైసీపీని టార్గెట్ చేస్తారా? అనేది చూడాలి.