Off The Record: తెలంగాణలో చాలా రోజుల తర్వాత మళ్లీ సెంటిమెంట్ మంటలు రాజుకున్నాయి. ఐతే… ఈసారి వ్యవహారం కాస్త డిఫరెంట్గా ఉంది. అధికార పార్టీనే ముందు మొదలుపెట్టింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నవ నిర్మాణం పేరుతో జనసేన సభ అన్న పాయింట్ దగ్గర కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ నెగెటివ్ కామెంట్స్ చేశారని, అలాంటి నాయకుడు ఇప్పుడు తెలంగాణ కోసం అంటూ సభ పెట్టడం ఏంటన్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మొదలుపెట్టిన ఇష్యూలోకి తర్వాత తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నేతలు ఎంటరయ్యారు, రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళంతా డైలాగ్ వార్ మొదలుపెట్టారు. ఐతే.. పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్ తర్వాత కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ బాగా రియాక్ట్ అయ్యారు.
నేను తెలంగాణలో తిరిగితే అడ్డుకుంటామని అంటున్నారు. ఇదేమన్నా వాళ్ళ అయ్య జాగీరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారాయన. ఆ మాటలు తెలంగాణ వాదులను మరింత హర్ట్ చేశాయంటూ….అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు పొన్నం. ఎస్… ముమ్మాటికీ తెలంగాణ మా అయ్య జాగిరే…నీ అయ్య జాగీరు కాదంటూ అన్న మాటలతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. ఇక్కడ మరో అంశం ఏంటంటే… ఈ టోటల్ ఎపిసోడ్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ వాదుల వాదన ఒకలా ఉంటే… బీజేపీ, జనసేన నేతల వాదన ఒక ఫ్రీక్వెన్సీలో ఉంది. పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటానంటే ఎందుకు అనుమతిఇవ్వరు… కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ… బీజేపీ నేతలు మాట్లాడారు. అదే సమయంలో మరో రకమైన విశ్లేషణ సైతం నడుస్తోంది. జనసేన వెనక బీజేపీ ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శలు కురిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, ఇప్పుడు పవన్ నోట బీజేపీ మాటలు రావడం చూస్తుంటే… ఇద్దరూ ఒకటేనన్న ఫీలింగ్ బయటకు వచ్చిందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఏదేమైనా.. పవన్ కళ్యాణ్ వ్యవహారంతో రాష్ట్రంలో మరోసారి సెంటిమెంట్ మొదలైంది. ఉద్యమకారులంతా తిరిగి ఏకమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. రూపం మారిన మోడ్రన్ సెంటిమెంట్ వార్లో చివరికి పైచేయి ఎవరిది అవుతుందోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.

