Off The Record : తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఇద్దరు నేతల గలాటా నడుస్తోంది. ఒకరు సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మరొకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా రోజులుగా పార్టీ వ్యవహారాలపై భిన్నంగా స్పందిస్తూ వస్తున్నారు ఇద్దరూ. ఇద్దరిదీ ఒకటే స్లోగన్. పార్టీ కోసం పని చేస్తున్నాం.. మాట నిలబెట్టుకోండన్నదే వాయిస్. జీవన్ రెడ్డి అయితే… అసలు ఈ బెంగతో ఆసుపత్రి పాలయ్యారని కూడా చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్… పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై నివేదిక ఇచ్చారు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి ప్రస్తావన కూడా ఉందట. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన నియోజకవర్గాల్లో పెరుగుతున్న సమస్యల్ని కూడా రిపోర్ట్లో ప్రస్తావించినట్టు తెలిసింది. అందులో జగిత్యాల… పటాన్చెరు సెగ్మెంట్స్ ఉన్నాయి. రెండు చోట్ల పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఇబ్బంది పడుతున్నారనే అంశం చర్చకు వచ్చింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా తనకు అవమానం జరిగిందనే ఫీలింగ్లో ఉన్నారు జీవన్రెడ్డి. అందుకే దాంతోపాటు పటాన్చెరు సమస్యను కూడా త్వరగా పరిష్కరించమని అధిష్టానం రాష్ట్ర నాయకులకు చెప్పినట్టు తెలిసింది. దీనికి తోడు పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా లేఖ రాశారు. కష్టకాలంలో కూడా పార్టీ కోసం నిలబడ్డ జీవన్ రెడ్డికి అన్యాయం జరక్కుండా చూడాలని అప్పీల్ చేశారాయన.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాల్లో కూడా క్లారిటీ ఉంది. నాడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని రండి …మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పిందంటూ పదేపదే ప్రస్తావిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఆ రకంగా అయితే ఆయనకు పదవి ఇవ్వాల్సింది.. లేదంటే, అధిష్టానం పిలిచి మాట్లాడి… తమ ఆలోచన ఏంటన్నది చెప్తే వివాదం లేకుండా ఉండేది. కానీ… ఆ పని జరక్కపోవడంతో… ఎమ్మెల్యే ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్ల రచ్చ జరుగుతోంది తప్ప… సమస్య పరిష్కారం అవడం లేదు. మంత్రి పదవి కాకపోతే… సీఎం పదవే రావచ్చని ఒకసారి, తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పుడు ఇంట్లో ఇద్దరం అననదమ్ములం ఉన్నామని తెలియదా..? అని మరోసారి స్టేట్మెంట్స్ ఇస్తూ చర్చకు పెడుతున్నారు మునుగోడు శాసనసభ్యుడు. ఇలా రోజుకో అంశం రావడంతో పార్టీలో కూడా కొంత చర్చకు అవకాశం కల్పించినట్టు అవుతోంది. రాష్ట్ర నాయకత్వం అయినా… దీని మీద ఫోకస్ చేసి సెట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఢిల్లీ మీటింగ్ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా… అధిష్ఠానం రాజగోపాల్ రెడ్డి తో మాట్లాడుతుందని చెప్పారు. ఆ ప్రకారం ఎమ్మెల్యేని ఢిల్లీ పిలుస్తారా? లేదంటే రాష్ట్ర నాయకులకే బాధ్యత అప్పగించి చూసుకోమంటారా అన్నది తేలాల్సి ఉంది. ఇలా…. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరి వ్యవహారం అధిష్టానం దగ్గర చర్చకు వచ్చిన క్రమంలో ఈ రచ్చ ఇప్పటికైనా సెట్ అవుతుందా లేక కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.