Off The Record: తాడిపత్రి రాజకీయ రచ్చ, దాని తాలూకు సెగ మరోసారి అనంతపురం జిల్లా కేంద్రాన్ని తాకింది. పోటా పోటీ ఫిర్యాదులతో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసినవే. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న జేసీ కుటుంబానికి 2019ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. వైసీపీ హయాంలోని ఐదేళ్ళు జేసీ కుటుంబ సభ్యుల మీద పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అప్పట్లో తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ గెల్చుకుంది. ఇక ఆ ఐదేళ్లపాటు కేసులు ఎదుర్కొంటూ దాదాపుగా ఒంటరి పోరాటం చేశారు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి. ఇక 2024లో పరిస్థితులు మారిపోయాయి. తిరిగి జేసీ చేతుల్లోకి అధికారం వచ్చింది. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వలేదు ప్రభాకర్రెడ్డి. కోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి ఎంటరైనా ఇబ్బందులు తప్పలేదు. జిల్లా వైసీపీ నేతలంతా ఒక్కటై జేసీకి ఎదురు నిలబడ్డా…. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటామని, ఆ విషయంలో రాజీ లేదంటున్నారు ప్రభాకర్రెడ్డి అనుచరులు. పైగా పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డితో సహా మొత్తం 24 మంది లోకల్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మా టార్గెట్ అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు.
ఆ 24మంది తప్ప.. వేరే ఎవరైనా సరే ఊళ్లో స్వేచ్ఛగా తిరగచ్చు.. ఎలాంటి ఎన్నికల్లోనైనా పోటీ చేయవచ్చని చెబుతున్నారు. కానీ… హరిహరాదులు దిగి వచ్చినా ఆ 24 మంది విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, వాళ్ళు పోటీ చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు మున్సిపల్ ఛైర్మన్. జేసీ అసలెందుకు ఈ 24మందిని టార్గెట్ చేశారంటే…. కథ చాలా పెద్దదేనని అంటున్నారు స్థానికులు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి వేధించడమేగాక…. తన ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఆయన మార్క్ చేశారట. ఆ 24మంది వాళ్లేనని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డిలతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన 24 మంది ముఖ్య కార్యకర్తలపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గతంలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి మంచం వేసుకుని పడుకుని మరీ వినూత్నంగా నిరసన తెలిపారు జేసీ. ఆయన తీరుపై జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద పెద్దారెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఆందోళన చేశారు.
ఇక ఇప్పుడు మరోసారి… ప్రభాకర్రెడ్డి టార్గెట్ చేసిన ఆ 24 మంది కలిసి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రభాకర్రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు వైసీపీ ముఖ్య కార్యకర్తలు. కొన్ని రోజులుగా జరిగిన ఘటనలను వినతిపత్రం రూపంలో ఇచ్చారు. 24 మందిని టార్గెట్ చేశామని ఓపెన్గా చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ నాయకులు. మరోవైపు ఇదే అంశంపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్షావలితోపాటు మరికొందరు నాయకులు అదనపు ఎస్పీని కలిశారు. వైసీపీ హయాంలో ఆడ,మగ తేడా లేకుండా దాడి చేశారని.. కేసులు పెట్టారని వివరించారు. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే మేమెందుకు చూస్తూ కూర్చోవాలని నిలదీశారు. ఆ 24 మంది తప్పా.. వేరే ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చని.. వారు వస్తే తాడిపత్రిలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని అంటున్నారు. ఇలా జేసీ ఆ 24మంది అంటూ…. గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.

