Off The Record: ఏపీ పాలిటిక్స్లో ఎప్పుడూ హాట్ టాపిక్ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ తాజాగా మరోసారి చర్చనీయాంశం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదలైన సెగల సైడ్ ఎఫెక్ట్స్ గురించే తాజా చర్చ. కుప్పం అంటే చంద్రబాబు… బాబు అంటే కుప్పం అన్నంతగా ఈ నియోజకవర్గంతో ఆయనకు బంధం పెనవేసుకుపోయింది. వరుసగా 8 విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారాయన. కానీ… 2024 ఎన్నికల్లో ఈ సీటును షేక్ చేయాలని ఓ రేంజ్లో పావులు కదిపింది వైసీపీ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. కుప్పంలో బాబుకు చోటు లేకుండా చేయాలంటూ… మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ పావులు కదిపారు. నాడు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు.. పెద్దిరెడ్డి పన్నని వ్యూహాలంటూ లేవని అంటారు. ఆయన అండతో కుప్పం వైసిపి నేతలు సైతం… స్థానికంగా తమ్ముళ్లకు చుక్కలు చూపించారు. వరుసగా పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ పోరు వరకు అన్నిటిలో వైసీపీ జెండా ఎగరేశారు. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందని అంటే.. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి కూడా చంద్రబాబు రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది.
Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ఆ అంశం ఏంటి..?
ఇక ఆయన వచ్చిన ప్రతిసారి రాళ్ల దాడులు, ఘర్షణలు కామన్ అయిపోయాయి కుప్పంలో. ఆ ఊపులోనే… ఈసారి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తామంటూ మీసాలు మెలేసి తొడలు కొట్టింది పెద్దిరెడ్డి వర్గం. కానీ.. చివరికి వాళ్ళొకటి తలిస్తే…. ఓటర్లు మరోటి తలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు బెడిసి కొట్టి వరుసగా ఎనిమిదోసారి కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. ఇక ఆ తర్వాతి నుంచి స్థానిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాడు మా అంత మొనగాళ్ళు లేరంటూ జబ్బలు చరుచుకున్న స్థానిక వైసీపీ నాయకులు చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. కొందరు బెంగళూరుకు షిఫ్ట్ అయిపోతే… ఇంకొందరు కామ్గా.. ఉన్నామా లేదా అన్నట్టుగా టైంపాస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగింది మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా… అందులో 18 వార్డులను గెలుచుకుని పాగా వేసి అప్పట్లో చంద్రబాబుకు షాక్ ఇచ్చింది వైసీపీ. టీడీపీ కేవలం 6 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే… నిరుడు నవంబరు 6న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పదవితోపాటు, ఆరో వార్డ్ కౌన్సిలర్గా కూడా రాజీనామా చేశారు సుధీర్. అందుకే ప్రస్తుతం ఛైర్మన్ ఎన్నిక అనివార్యం అయింది. రాష్ట్రంలో అధికారం మారాక ఇక్కడ కూడా బలాబలాలు మారిపోయాయి. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు, ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో ఛైర్మన్ పదవి సైకిల్ పార్టీ సొంతమైంది. వైసీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. దీంతో టిడిపి సునాయాసంగా విజయం సాధించింది. వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి వరించింది. అయితే… ఎన్నిక ముందు వరకు సై అంటే సై అన్న వైసిపి నేతలు….చివరికి వచ్చే సరికి చేతులెత్తేశారట. నలుగురు కౌన్సిలర్లు అయితే చివరి నిమిషంలో వైసిపికి షాక్ ఇచ్చి టిడిపి జై కొట్టారట. అదంతా అధికార పార్టీ వ్యూహం వల్లేనన్నది లోకల్ టాక్.
Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ఆ అంశం ఏంటి..?
అయితే…. ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకునే కొత్త చర్చ జరుగుతోంది కుప్పంలో. నాడు ఏకంగా చంద్రబాబునే ఓడిస్తామంటూ… బీరాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు మున్సిపాలిటీ బలం ఉన్నా సరే… ఎందుకు వదిలేశారు? కనీసం పట్టించుకున్న పాపాన ఎందుకు పోలేదు? అసలా ఊరితో నాకేం పని అన్నట్టుగా ఎందుకు ఉన్నారని మాట్లాడుకుంటున్నారట స్థానికంగా. అంటే… తొడలు కొట్టడాలు, మీసాలు మెలేయడాలన్నీ అధికారం ఉంటేనేనా? లేదంటే… బలం ఉన్న మున్సిపాలిటీని కూడా ఎందుకొచ్చిన గొడవలే అనుకుని వదిలేస్తారా అన్న చర్చ స్థానిక వైసీపీ కేడర్ మధ్యనే జరుగుతోందట. మిమ్మల్ని నమ్ముకుని మేము ఆ రోజు చెలరేగిపోతే… ఇప్పుడు నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కుప్పం నేతల క్వశ్చన్ అట. ఇక టిడిపి నేతల సెటైర్స్ సంగతి సరేసరి. అయితే కొద్ది మంది వైసీపీ సీనియర్ నేతలు మాత్రం పెద్దిరెడ్డి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను పరోక్షంగా పర్యవేక్షించారని, పార్టీకి ద్రోహం చేస్తూ వెళ్లిపోయి టీడీపీకి ఓటేసిన కౌన్సిలర్స్ని వెంటనే సస్పెండ్ చేయమని చెప్పింది ఆయనేనని అంటున్నారు. ఈ వాదనలు, వివరణల సంగతి ఎలా ఉన్నా… కుప్పం వైసిపి క్యాడర్ మాత్రం మా పెద్దాయన ఎక్కడ అంటూ గట్టిగానే నిలదీస్తున్నారట. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.