Off The Record: నెల్లిమర్లలో నిర్లిప్తంగా టీడీపీ, వైసీపీ..

  • నెల్లిమర్లలో నిర్లిప్తంగా టీడీపీ, వైసీపీ..
  • నగర పంచాయతీలో వార్డులు పెరిగే అవకాశం..
  • స్థానిక ఎన్నికలపై రెండు పార్టీల్లోనూ ఆసక్తి లేని వైనం..
  • పునర్విభజనలో నెల్లిమర్ల నియోజకవర్గం భవిష్యత్‌పై అనుమానాలు..
  • నాయకత్వం తీరుపై వైసీపీ కేడర్‌లో అసహనం..
  • కష్టపడ్డా ప్రాధాన్యం ఉండదేమోనన్న అనుమానంతో టీడీపీ లీడర్స్‌..
  • జనసేన ఎమ్మెల్యే ప్రభావం పెరిగి టీడీపీ పాత్ర తగ్గుతోందన్న టాక్‌..
  • నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రాబల్యంపై చర్చలు..
  • నాయకత్వపు నిర్లిప్తత వైసీపీని దెబ్బతీయబోతోందా?..
Otr Nellimarla

Otr Nellimarla

Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు లోకల్‌లో అంత సానుకూలత కనిపించకపోయినా, ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడంలో ప్రతిపక్ష వైసీపీ కూడా పూర్తి స్థాయి సన్నద్ధతతో లేదట. నెల్లిమర్ల నగర పంచాయితీకి ఆర్థికంగా బలమైన వనరులు ఉన్నాయి. జూట్ మిల్లు, సారిపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, స్థానిక పన్నుల రూపంలో ఆదాయం బాగానే వస్తోంది. 20 వేలకుపైగా ఓటర్లతో పాటు ప్రస్తుతం ఉన్న 20 వార్డులకు తోడు స్థానిక ఎన్నికల నాటికి మరో మూడు వార్డులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల వేడి కనిపించాల్సిన సమయంలో రెండు ప్రధాన పార్టీల్లోనూ ఉత్సాహం కొరవడినట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్న ప్రచారం కారణంగా నెల్లిమర్ల రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం అయి ఉండవచ్చని అంటున్నారు. గత ఎన్నికల్లో 13 కౌన్సిలర్ స్థానాలు గెలిచి చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న వైసీపీకి ఇప్పటికీ నగరపంచాయితీలో బలమైన ఓటు బ్యాంక్‌ ఉందని చెబుతుంటారు రాజకీయ పరిశీలకులు. అలాగే…నెల్లిమర్ల నియోజకవర్గం స్థాయిలో కూటమి ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉందన్న అభిప్రాయాలు సైతం పెరుగుతున్నాయి. అధికారం లేక వైసీపీలో స్తబ్దత కనిపిస్తుంటే… అలకలు, భవిష్యత్ రాజకీయ సమీకరణలపై నాయకుల్లో స్పష్టత లేకపోవడం లాంటి కారణాలతో కూటమి డీలా పడుతోందట.

రాష్ట్రం మొత్తం మీద పార్టీ యాక్టివ్‌ అయినా… నెల్లిమర్లలో మా నాయకులు మాత్రం దూకుడుగా లేరని స్థానిక వైసీపీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందే కొందరు నాయకులు డిఫెన్స్‌లో పడటం వల్ల కార్యకర్తల్లో కూడా ఉత్సాహం తగ్గినట్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమికి స్థానికంగా మరో రకమైన సమస్య ఎదురవుతోందట. రేపు నగర పంచాయతీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందనే అంశం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు కష్టపడి పార్టీని నిలబెట్టినా… రేపు తమకు సరైన ప్రాధాన్యం దక్కకపోవచ్చనే భావనలో కొందరు నాయకులు ఉన్నట్టు క్యాడరే చెప్పుకుంటోంది. ఈ అసంతృప్తి కారణంగానే టీడీపీ నాయకులు కొద్దిమంది ఎమ్మెల్యే నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే ప్రభావం పెరగడం, నిర్ణయాల్లో టీడీపీ నాయకుల పాత్ర తగ్గుతోందనే అభిప్రాయం కూడా స్థానిక రాజకీయ వర్గాల్లో ఉంది. నగరపంచాయితీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం చాటుకున్నప్పటికీ, అనంతర రాజకీయ పరిణామాలు సమీకరణల్ని మార్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వీడి అటు వైపు వెళ్లడం అధికార పక్షానికి బలం చేకూర్చింది. అయితే ఆ బలం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలింది.

×
×
Ad

ప్రస్తుతం నెల్లిమర్ల ప్రజల్లో అభివృద్ధి పనుల విషయంలో అసంతృప్తి, నాయకుల మధ్య విభేదాలు, స్థానిక స్థాయిలో వర్గపోరు వంటి అంశాలు ఎన్నికల రిజల్ట్ పై ప్రభావితం చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నగరపంచాయితీ ఎన్నికల్లో కూటమి అధికార బలం ఒక ప్రధాన అంశమైతే, స్థానిక అసంతృప్తి మరో కీలక అంశంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కూటమికి గట్టి పోటీ ఇచ్చే సామర్థ్యం వైసీపీకి ఉన్నప్పటికీ నాయకత్వంలో పేరుకుపోయిన నిర్లిప్తత పార్టీ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ఈ ఎన్నికల్లో గెలుపు కంటే అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల ఐక్యత, సీట్ల పంపకం వంటి అంశాలే ఫలితాలను నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. అందుకే నెల్లిమర్ల నగరపంచాయితీ ఎన్నికలు ఈసారి సాంప్రదాయ అధికార, ప్రతిపక్ష పోరుగా కాకుండా, ఇరు పార్టీల అంతర్గత బలాబలాలకు పరీక్షగా మారతాయని అంటున్నారు.