Off The Record: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ గత వారం ఆయన సొంతూరు కిర్లంపూడిలో జరిగింది. అనుచరులు, అభిమానుల పేరుతో ప్రోగ్రామ్ నిర్వహించినా…. మెయిన్ లీడ్ తీసుకున్నది మాత్రం వైసీపీ నేతలే అన్నది అంతా చెప్పుకునే మాట. అంత వరకు బాగానే ఉన్నా… కార్యక్రమంలో కూటమి ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి జన సేనను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం జరిగిందా అన్నది లేటెస్ట్ పొలిటికల్ టాక్. ఇదిగో సాక్ష్యం అంటూ… అక్కడ జరిగిన కొన్ని వ్యవహారాలను ఉదహరిస్తున్నారు కొందరు విశ్లేషకులు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్స్ కోసం ఉద్యమం చేశారు ముద్రగడ. దీక్షలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్పట్లో అన్ని పార్టీల నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. నాడు ఇండస్ట్రీ పెద్ద దాసరి నారాయణరావు, మెగా స్టార్ చిరంజీవి స్పందించి ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ప్రభుత్వం ఖచ్చితంగా కాపు రిజర్వేషన్లపై ఆలోచించాల్సిందేనని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూడా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు కూడా. మీరు చెప్పిన మాటను మళ్లీ గుర్తు చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటంటూ అప్పుడు చిరంజీవి గట్టిగానే మాట్లాడారు.
సరిగ్గా అదే వీడియోను ఇప్పుడు ముద్రగడ సంస్మరణ సభలో ప్లేయ చేయడం, అదీకూడా కాపు సామాజికవర్గానికి చెందిన ముఖ్యులు, ప్రముఖులు ఉన్న వేదిక కావడం కలకలం రేపుతోంది. అయితే… ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఆ మాటలు మాట్లాడిన సమయంలో చిరంజీవి పొలిటికల్గా యాక్టివ్ రోల్లో ఉన్నారు. అందుకు అనుగుణంగానే స్టాండ్ తీసుకుని మాట్లాడారన్నది ఎక్కువ మంది విశ్లేషణ. దాన్ని తీసుకువచ్చి ఇప్పుడు ముద్రగడ సంతాప సభలో వైసీపీ నేతలు ప్లే చేయడమంటే ప్లానింగ్ వేరే ఉన్నట్టుంది అన్న చర్చలు నడుస్తున్నాయి. ప్రధానంగా కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం అయి ఉండవచ్చని అంటున్నారు. అయితే… పద్మనాభం చనిపోయాక చిరంజీవి ఎటువంటి సంతాప ప్రకటన చేయలేదు. అందుకు కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చాక జరిగిన పరిణామాలు, ఆయన వైసీపీలో చేరడం లాంటి పరిణామాలతో మెగాస్టార్ కూడా సైలెంట్ అయి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఇప్పుడు పాత మాటల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వెనక వేరే ఉద్దేశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలపడుతోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామి అయినందున పాత వీడియోలు తవ్వి తీసి ప్లే చేస్తే… కచ్చితంగా దాని ప్రభావం ఉంటుందని ఫ్యాన్ పార్టీ నేతలు అంచనా వేసి ఉండవచ్చని, అందుకే ఏరి కోరి వాటిని వెతికి పట్టుకొచ్చి కార్యక్రమంలో పబ్లిక్ ముందు ఉంచినట్టు చెప్పుకుంటున్నారు. ప్రత్యేకించి కిర్లంపూడిలో, ముద్రగడ సంతాప సభలో అయితే… తాము చెప్పాల్సింది చెప్పినట్లు ఉంటుంది, తమకు సంబంధం లేదన్నట్టూ జరిగిపోతుందని భావించి ఉంటాని విశ్లేషిస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్ల అంశంపై జనసేనను కూడా గట్టిగా డిఫెన్స్లోకి నెట్టేసినట్టు ఉంటుందని భావించారట. గతంలో మెగా బ్రదర్ ఇచ్చిన కమిట్మెంట్ను ఇప్పుడు డిప్యూటీ సీఎంకి గుర్తు చేసిన్న లెక్కలు కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. అయితే చిరంజీవి ఓల్డ్ వీడియోల ప్రజెంటేషన్పై అటు జనసేన నుంచిగాని, ఇటు మెగా ఫాన్స్ నుంచిగానీ… ఎక్కడా రెస్పాన్స్ లేదు. దానికి సంబంధించి ఏమాత్రం… చిన్నపాటి రిప్లై ఇచ్చినా హైప్ అయిపోతుందన్న ఉద్దేశ్యంతోనే అలర్ట్గా ఉండి ఉండవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపు రిజర్వేషన్లకు సంబంధించి గతంలో చిరంజీవి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటి పరిస్థితిని బట్టి అలా మాట్లాడి ఉండొచ్చుగానీ… ఇప్పటికీ ఆ హామీ అమలు అవ్వలేదు కదా అని గుర్తు చేస్తున్నారు వైసీపీ కాపు నాయకులు. ప్రస్తుతం ప్రభుత్వంలో తమ్ముడి పార్టీ కూడా ఉంది కాబట్టి… చిరంజీవిని ఆ యాంగిల్లో బయటికి తీసుకువస్తే… మరింత అడ్వాంటేజ్ అవుతుందన్న కోణంలోనే పాత వీడియోల తవ్వకాలు జరిపి ఉంటారని చెప్పుకుంటున్నారు. ప్రత్యేకించి ముద్రగడ సంతాప సభలో చిరంజీవి ప్రస్తావన తీసుకు రావడం ద్వారా… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, అదే సమయంలో ఆ సామాజికవర్గంలో తాము మైలేజ్ పొందడం లాంటి రెండు లక్ష్యాలను ఏకకాలంలో సాధించేలా ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేసి ఉండవచ్చన్నది పొలిటికల్ పండిట్స్ మాట. దీని మీద తదుపరి రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.

