Off The Record: మేకా శేషుబాబు….. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తూ వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ దరి చేరారు. పార్టీ కూడా ఆయన సీనియారిటీని గౌరవించి ఎమ్మెల్సీని చేసింది. అయితే… ఆయన మాత్రం గ్రూపు తగాదాలు, సొంత పెత్తనాలకు ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో…. పాలకొల్లు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పక్కన పెట్టేశారని జిల్లా వైసీపీ నాయకులు చెప్పుకుంటారు. 2014 ఎన్నికల్లో పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మేకా శేషుబాబును తర్వాతి కాలంలో అక్కడి నుంచి తప్పించేశారు పార్టీ పెద్దలు. ఇక 2019, 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా నిరాశ తప్పలేదు. దీంతో పాలకొల్లు వైసీపీలో సొంత కుంపటి ఏర్పాటు చేసుకుని గ్రూపు తగాదాలకు కేరాఫ్ అయ్యారన్న నివేదికలు వైసీపీ అధిష్టానానికి చేరాయి. అసలు పాలకొల్లు నియోజకవర్గంలో తనకంటే తోపు మరొకరు లేరన్నట్టుగా వ్యవహరిస్తూ పార్టీ ఆదేశించిన కార్యక్రమాలన్నింటిని సపరేటుగా చేయడం మొదలుపెట్టారట. 2024 ఎన్నికల తర్వాత పాలకొల్లు ఇన్చార్జ్గా ఉన్న గుడాల గోపీకి పోటీగా శేషుబాబు కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన నేతలు వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలను సైతం విడివిడిగా నిర్వహించడం పెద్ద దుమారమే రేపింది.
దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ని సస్పెండ్ చేసింది అధిష్టానం. దాంతో… పూనకాలు పెంచుకుని ఊగిపోయిన శేషుబాబు వైసీపీ ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా తన బలం ఏంటో త్వరలోనే నిరూపిస్తానంటూ శపథాలు సైతం చేశారట. అదే ఊపుతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నించగా బెడిసికొట్టినట్టు తెలిసింది. పదవి ఇచ్చిన పార్టీలోనే తిన్నగా లేరు, ఇక మన దగ్గరికొచ్చి ఏం చేస్తారంటూ పాలకొల్లు టిడిపి నేతలు శేషుబాబును గట్టిగానే అడ్డుకున్నారట. దీంతో కొంతకాలం సైలెంట్ అయిన మాజీ ఎమ్మెల్సీ…. పరిస్థితి చక్కబడిందని భావిస్తూ.. తిరిగి వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల పార్టీ అధినేత జగన్ను కలిసి తన కుమారుడి వివాహానికి రమ్మని ఆహ్వానించడం ఒక ఎత్తయితే… దీని వెనక పొలిటికల్ కేలిక్యులేషన్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఓవైపు జగన్కు ఆహ్వానపత్రిక ఇస్తూనే… అదే సమయంలో పార్టీలో తన రీఎంట్రీకి లైన్ క్లియర్ చేయాలని కోరినట్టు సమాచారం. వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం భార్య, తండ్రితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన శేషు బాబు…. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారట పాలకొల్లు ఫ్యాన్ లీడర్స్. పదవులు ఇచ్చి ప్రాధాన్యత కల్పిస్తే…. తాను జగన్తో కలిసి ఉన్న ఫ్లెక్సీలను అనుచరులతో చింపేయించి తగలబెట్టించారంటూ పదేపదే గుర్తు చేసుకుంటున్నారట.
ఇక అధిష్టానం తన సస్పెన్షన్ ఎత్తివేసినట్లుగా .. పాత పార్టీలోనే కొనసాగను న్నట్లుగా మీడియాకు తెలిపేందుకు సమావేశం ఏర్పాటు చేయాలనుకున్న శేషుబాబుకు పార్టీ పెద్దల నుంచి పూర్తి అనుమతి రాకపోవడంతో డైలమాలో పడ్డట్టు తెలిసింది. విషయాన్ని అధికారికంగా చెప్పేదాకా…. సైలెంట్గా ఉండమని ఆదేశించినట్టు సమాచారం. పాలకొల్లు ప్రస్తుత ఇన్ఛార్జ్ గుడాల గోపి సోషల్ మీడియా పోస్ట్లకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. క్యాడర్ కు కేసుల భయం నుండి భరోసా కల్పించడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో ఆయన విఫలమైనట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో… ఇప్పటికే ఆరు సార్లు ఇన్చార్జిలను మార్చిన వైసిపి మరోమారు కొత్త నేతను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నంలో ఉందన్న సమాచారంతోనే శేషుబాబు తిరిగి తన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముక్కలు ముక్కలుగా మారిన పాలకొల్లు వైసీపీలోకి శేషుబాబు రీ ఎంట్రీ ఇస్తే కథ మళ్లీ మొదటికే వస్తుందంటున్నారు ఇక్కడి నేతలు. పదవులు ఇచ్చినపుడు పనులు చేయరు, పక్కనపెడితే శపథాలు చేస్తారు, అసలు బలం అర్థమఅయ్యాక మళ్ళీ చేర్చుకోండి బాబూ అంటూ కాళ్ళ వేళ్ళ పడతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ వైసీపీ సీనియర్ నేత వ్యవహార శైలి చర్చనీయాంశం అయ్యింది. ఏ ఎండకు ఆ గొడుగు పడతారని విమర్శలున్న శేషుబాబు విషయంలో మా పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు పాలకొల్లు వైసీపీ కార్యకర్తలు.