Off The Record: కొందరు వివాదం కోసం మాట్లడుతుంటారు.. మరికొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోదామని వాయిస్ పెంచుతుంటారు. కానీ… వాటన్నిటితో సంబంధం లేకుండా… మనసులో ఏది ఉంటే అది మాట్లాడి.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఆ తర్వాత టీడీపీలోకి మారినా.. వారి మాట తీరు మారలేదు. ఇబ్బందులు వస్తాయని తెలిసినా….. తగ్గకుండా మాట్లాడుతుంటారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాల విషయంలోనూ, నాయకుల్ని కంట్రోల్ చేయలేని విషయాల్లో నిండు సభల్లోనే మీరు మారాలంటూ చెప్పే వారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న లోపాల గురించి కూడా ఓపెన్గా మాట్లాడేవారు. దీని వల్ల పార్టీకి ఇబ్బంది కల్గిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
Read Also: JD Vance: ఎలాన్ మస్క్ శకం ముగియలేదు.. ట్రంప్కు సలహాలిస్తారు
వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం కష్టమంటూ… సంచలన వ్యాఖ్యలు చేశారాయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా, ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు సరిగ్గా అమలు కావడంలేదని కుండ బద్దలు కొట్టారు. దీని వల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అభిప్రాయపడ్డారాయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజల జేబులో నేరుగా డబ్బు పడేవని.. కానీ ఇప్పుడు అలాంటి పథకాలు లేకపోవడంతో ప్రజలు నాయకులను తిడుతున్నారని అన్నారు జేసీ. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలవడం కష్టమని, ప్రజలు తమను నేరుగా విమర్శిస్తున్నారని ఆయన చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది… వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. వైసీపీ, వామపక్ష పార్టీలు దీనిపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. పింఛన్ల పెంపు మినహా నేరుగా డబ్బు అందే విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేది స్థానిక నేతలకు బాగా తెలుసునని అంటున్నారు జేసీ. అయితే ఆయన ఉన్న వాస్తవం చెప్పారో లేక తనకు తోచింది అన్నారోగానీ….. తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించుకుని సక్సెస్ మూడ్లో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలంగా ఉంది. పైగా జేసీ మాట్లాడిన మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. నిజానిజాల సంగతి పక్కనబెడితే… జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపుతున్నాయి.