Off The Record: కోనసీమలో జనసేన వీక్ అవుతోందా? లోకల్ ఎన్నికలకు ముందే కొత్త టెన్షన్..

  • కోనసీమ జిల్లాలో జనసేనకు గట్టి బలం, అభిమాన జనం..
  • జిల్లా స్థాయిలో పార్టీని నడిపే నేత లేక కేడర్‌ డీలా..
  • నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల తీరుపై పార్టీలో అసహనం..
  • కొత్తపేట, మండపేట ఇన్ఛార్జ్‌లు గాలికి వదిలేశారన్న విమర్శలు..
  • అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురానికి నో ఇన్ఛార్జ్‌లు..
  • స్థానిక ఎన్నికల్లో టిక్కెట్స్‌ ఆశిస్తున్న ఆర్థికంగా బలహీన నేతలు..
  • వలసల వైపు జిల్లా స్థాయి నేతల చూపు?..
  • టీడీపీ, బీజేపీల నుంచి అరువు తెచ్చుకునే ప్లాన్‌..
  • వైసీపీ నుంచి లాక్కోవాలనుకుంటున్నా పార్టీలో వ్యతిరేకత..
Otr Konaseema Jsp

Otr Konaseema Jsp

Off The Record: మెగా ఫ్యామిలీకి పెద్ద సంఖ్యలో అభిమానులు, జనసేనకు గట్టి కేడర్‌ బలం ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆశించినంత బలోపేతం కాలేదా? జిల్లా స్థాయిలో సమర్థ నాయకత్వం లేదా అంటే… అన్ని ప్రశ్నలకు అవునన్నదే సమాధానం. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతున్న టైంలో… జిల్లా గ్లాస్‌ పార్టీలోని అంతర్గత పరిణామాల గురించి గట్టి చర్చలే జరుగుతున్నాయి. ముఖ్యంగా… జిల్లా లెవల్‌లో రాజకీయాలను శాసించే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్ల సమన్వయం దెబ్బతింటోందని మాట్లాడుకుంటున్నారు. పునర్విభజన తర్వాత కోనసీమ జిల్లాకు ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడు లేడు. దీంతో స్థానిక శ్రేణుల్లో నిరుత్సాహం పెరిగిపోతోంది. ప్రస్తుతం ఉన్న కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల పనితీరుపై కూడా కేడర్‌లో అసహనం పెరిగిపోతోందట. వాళ్ళలో ఎక్కువ మంది పార్టీ నిర్మాణం కంటే వ్యక్తిగత వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొత్తపేట ఇన్ఛార్జ్‌ బండారు శ్రీనివాస్, మండపేటలో వేగుళ్ళ లీలా కృష్ణ లాంటి వాళ్లు పార్టీని అడ్డుపెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారే తప్ప…బలోపేతం గురించి పట్టించుకోవడంలేదంటూ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోందట.

కొందరు ఇన్ఛార్జ్‌లు అసలు పని మానేసి ఇసుక, మట్టి దందాలు, రేషన్ బియ్యం మాఫియాలో భాగస్వాములు అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సైతం జనసేన పార్టీని పట్టించుకోకుండా సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారన్నది కేడర్‌ వాయిస్‌. ఇవన్నీ కలగలిపే కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోతోందని అంటున్నారు. చివరికి పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా కూడా… ఖండించలేనంత బిజీగా మా వాళ్ళు మారిపోయారంటూ ద్వితీయ శ్రేణి కామెంట్‌ చేస్తోంది. మరోవైపు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్‌ లేకపోవడం లోటుగా మారిందంటున్నారు. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాలకు కూడా జనసేన ఇన్ఛార్జ్‌లు లేరు. దీంతో…స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఏళ్ళుగా జెండాలు మోస్తున్నస్థానిక ఆశావహులకు అవకాశం కల్పిస్తారా? లేక ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తారా? అనే సందేహాలు సైతం కార్యకర్తల్లో ఉన్నాయి.

కోనసీమ గ్రామాల్లో జనసేనకు ఆర్ధికంగా బలమైన నాయకులు లేకపోవడమే అలాంటి సందేగాలకు కారణమని తెలుస్తోంది. ఇక్కడ పార్టీ టిక్కెట్స్‌ను ఆర్థికంగా బలహీనమైన నాయకులు ఎక్కువగా ఆశిస్తున్నారట. మన పార్టీకి కేడర్‌ బలం ఉంది… డబ్బుతో పనేముందని వారు అంటున్నా….మనీ మేటర్‌ లేకుండా ఎన్నికల్లో ఎలా సాధ్యమన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. మరోవైపు జిల్లా స్థాయి నేతలు మాత్రం…. సొంత వారిని పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి వలస తెచ్చుకోవడానికే ఉత్సాహం చూపుతున్నారట. బలమైన క్యాడర్ ఉన్న కోనసీమ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది జనసేన. కానీ… అంత సంఖ్యలో బలమైన నేతలు లేకపోవడం లోటుగా మారిందని చెబుతున్నారు. దీంతో…. కూటమిలోని టీడీపీ, బీజేపీల నుంచి అరువు తెచ్చుకుని అయినా… జనసేన టిక్కెట్లు ఇప్పించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అసాగే…. గ్రామాల్లో అంగ బలం, అర్థబలం ఉన్న వైసీపీ సీనియర్ నేతల కోసం కూడా గేలం వేస్తున్నారట. కానీ… అట్నుంచి లాక్కునే ప్రయత్నాలను జనసేన పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో… అధిష్టానం జిల్లా నాయకత్వాన్ని బలోపేతం చేసి, కార్యకర్తల్లోని అసంతృప్తిని నివారిస్తుందా? లేక పక్క పార్టీలనుంచి లాక్కుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.