Off The Record: ఎన్నికల తర్వాత స్థానిక నేతలను పట్టించుకోని కమలనాథులు

  • జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బలంగా బీజేపీ..
  • అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపిన పార్టీ..
  • మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డ లోకల్‌ కమలనాథులు..
  • అప్పట్లో కోరుట్ల అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపీ అర్వింద్ పోటీ, ఓటమి..
  • ఓడిపోయాక అర్వింద్‌ పట్టించుకోలేదని అసహనం..
  • జగిత్యాలలో పోటీచేసి ఓడిపోయిన భోగ శ్రావణి..
  • లోక్‌సభ ఎన్నికల తర్వాత కనిపించడం తగ్గించేసిన శ్రావణి..
  • పట్టణ నేతలకు అందుబాటులో లేని శ్రావణి..
Bjp

Bjp

Off The Record: జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ… కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ మూడో స్థానంలో నిలిచినప్పటికి… కొన్ని గ్రామాలు, జగిత్యాల పట్టణంలో ఆధిక్యత ప్రదర్శించడం కేడర్‌లో జోష్ నింపింది. అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తూ… కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలలో స్పష్టమైన ఆధిక్యత సాధించింది బీజేపీ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ జగిత్యాల అసెంబ్లీ పరిధిలో కమలం పార్టీకే ఆధిక్యత లభించింది. ఇక తమకు మంచిరోజులు వచ్చాయని సంబరపడ్డారు లోకల్ కమలనాథులు. అయితే పెద్దలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లేలా వ్యవహరిస్తున్నారట… కోరుట్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అర్వింద్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ… తాను ఇక్కడకు తరచుగా వస్తానని… పార్టీని పటిష్టం చేస్తానని చెప్పారు… కానీ…ఆయన ఎంపీ అయ్యాక ఒకటిరెండుసార్లు తప్ప కన్నెత్తి చూసింది లేదు. కోరుట్ల లోకల్ లీడర్లను ఖాతరు చేయడం లేదట. ఈ పరిస్థితి కక్కలేక, మిగలేక అన్నట్టుగా ఉందట స్థానిక నాయకులకు. బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్న భోగ శ్రావణి అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేతో కయ్యం వల్ల బయటకు రావాల్సి వచ్చింది.. తనకు అవమానం జరిగిందంటూ ఆమె రచ్చకెక్కడం.. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.. కార్‌ దిగిన శ్రావణి కాషాయం కండువా కప్పుకుని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు…

Read Also: Oka Parvathi Iddaru Devadasulu : రూ.2 కోట్లు పెట్టాం.. నిండా ముంచేశాడు.. నిర్మాతల ఆవేదన

×
×
Ad

జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని దాదాపు 25శాతం ఓట్లను సాధించింది… కాస్తంత కష్టపడితే నెక్స్ట్‌ చాన్స్‌ వస్తుందని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమోగానీ…… పార్లమెంట్ ఎన్నికల తర్వాత భోగ శ్రావణి క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లోనూ ఆమె పాల్గొనడం లేదట… నియోజకవర్గ నేతలకు… పట్టణ ముఖ్య నాయకులకు కూడా అందుబాటులో ఉండకుండా, ఒకవేళ కలిసినా ఎడమొఖం పెడమొహంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. ఇలా నేతల మధ్య సఖ్యత లేకపోవడం, తమకేం పట్టనట్టుగా వ్యవహరించడం ఇప్పుడిప్పుడే జగిత్యాల బలపడుతున్న కమలానికి అడ్డంకిగా మారిందంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చులకు కూడా శ్రావణి లెక్కలు చూపలేదని, అడగడం వల్లనే ఇలా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ చెవులు కొరుక్కుంటున్నారట కాషాయ కార్యకర్తలు… అదేం కాదు… ఎంపీ అర్వింద్‌తో తేడా రావడం… ఆయన పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో తనకు ప్రయార్టీ ఇవ్వకుండా ఇతర నేతలకు పదవులు ఇవ్వడం వల్లనే దూరం అయ్యారనేది ఇంకో వెర్షన్‌. ఇన్నాళ్లు జగిత్యాలోనే నివాసం ఉన్న శ్రావణి సడన్‌గా నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చడంతో అసలేం జరుగుతోందో క్యాడర్‌కు అంతుపట్టడం లేదట. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట తిరిగిన చోటా మోటా నాయకులకు ఇది మింగుడు పడటం లేదంటున్నారు. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో నియోజకవర్గ ఇంచార్జ్‌ దూరం జరగడంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయట జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో….

Read Also: Hyderabad family suicide: చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా?

ఇక పెద్దదిక్కుగా ఉంటాడనుకున్న ఎంపీ అర్వింద్‌ నెలలు గడుస్తున్నా జగిత్యాల జిల్లా వైపు చూడటం లేదంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు.. ఎంపీగా పోటీ చేసినప్పుడు తాము పనిచేశామని.. ఇప్పుడు తమకు లోకల్‌గా నేతలేని సందర్బంలో మొహం కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది కేడర్‌. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ బయలుదేరింది. కమలం పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యం కానీ… జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పని లేదని, అందుకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌ని పట్టించుకోదనే అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు తమ ఎన్నికలు కాదు… పైగా లోకల్ లీడర్లు ప్రజాప్రతినిధులు అయితే లేనిపోని తలనొప్పులు అని వారు భావిస్తున్నారన్న అభిప్రాయం సైతం ఉంది. మొత్తానికి తమ ఎన్నికలు కాదు కాబట్టి… తప్పించుకు తిరగాలనే ప్లాన్‌లో పెద్ద లీడర్లు ఉన్నారన్నది ఈ రెండు నియోడకవర్గాల్లో ఉన్న అభిప్రాయం.